నల్లమలపు బుజ్జి ఆశలన్నీ ఈ మెగా హీరోపైనే

Update: 2017-03-29 08:49 GMT

అతి తక్కువ వ్యవధిలో సుప్రీమ్ హీరోగా మెగా అభిమానులకి చేరువ ఐన సాయి ధరమ్ తేజ్ గత నెల పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ విన్నర్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మించగా పండగ చేస్కో వంటి రొటీన్ విజయం అనంతరం గోపిచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రం ఇది. తిక్క వంటి పరాజయం తరువాత విడుదలైన సాయి ధరమ్ తేజ్ చిత్రం కావటంతో విన్నర్ పై పెద్దగా అంచనాలు ఏమి లేవు. పైగా మూస కథలతో సినిమాలు చేసే దర్శకుడి గోపిచంద్ మలినేని పండగ చేస్కో కి కథ అందించిన కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్ తయారు చేసిన మూస కథనే ఎంచుకోవటం ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి ఏర్పడకపోవటానికి మరో కారణం. అయితే నిర్మాతలు మాత్రం తమ శక్తీ సామర్ధ్యాలన్నీ వెచ్చించి విన్నర్ చిత్రానికి కావలసినంత పబ్లిసిటీ చేకూర్చారు పాపం. కానీ ఈ చిత్రం మాస్ ప్రేక్షకులని కూడా అలరించలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. విన్నర్ బిజినెస్ క్లోసింగ్ టైంకి నిర్మాతలకి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల నష్టం మిగిలింది.

సాయి ధరమ్ తేజ్ విన్నర్ విడుదలై నెల తిరిగే సరికే మరొక మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన మిస్టర్ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రానికి కూడా నిర్మాత నల్లమలపు బుజ్జి నే కావటం విశేషం. విన్నర్ తో ఏర్పడ్డ ఆర్ధిక నష్టాలలో నుంచి మిస్టర్ చిత్రం ద్వారా బయటపడాలని ఆశపడుతున్నారు నల్లమలపు బుజ్జి. అయితే ఇప్పటికే లోఫర్ వంటి పరాజయం తరువాత వరుణ్ తేజ్ చేస్తున్న చిత్రం కావటం, పైగా ఆగడు, బ్రూస్ లీ చిత్రాలతో ఘోర పరాజయాలు చవి చుసిన దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న చిత్రం కావటంతో విడుదలై మంచి టాక్ సంపాదించుకునే వరకు మిస్టర్ చిత్రంపై హైప్ ఏర్పడే అవకాశమే లేదు. కాబట్టి నల్లమలపు బుజ్జికి ఈ చిత్రం ద్వారా విడుదలకి ముందుగానే టేబుల్ ప్రాఫిట్ వచ్చే అవకాశం లేదు. మిస్టర్ చిత్రం ఆడితేనే విన్నర్ తో ఏర్పడ్డ నష్టాల నుంచి ఈ నిర్మాతకి ఊరట లభిస్తుంది. మరి సుప్రీమ్ హీరో తెచ్చిన నష్టాలని మెగా ప్రిన్స్ పూడుస్తాడో లేదో చూద్దాం.

Similar News