నయన్-ప్రభు దేవాల కాంబినేషన్ మళ్లీ మెటీరియలైజ్ అవుతోంది

Update: 2017-03-20 07:30 GMT

దక్షిణాది సినిమాలలో స్టార్ హీరోస్ కి సమానంగా క్రేజ్ వున్న అతి తక్కువ మంది కథానాయికల్లో ప్రధానంగా నయనతార పేరు వినపడుతుంది. నయన్ నటించే ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ కి కూడా ఫాన్సీ రేట్లతో పంపిణీదారులు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ నిర్మాతల నుంచి సినిమా కొనుక్కుంటున్నారంటే అది కేవలం నయనతారకి వున్న క్రౌడ్ పుల్లింగ్ కాపబిలిటీ వల్లనే. ఈ నెల చివర్లో విడుదల కాబోతున్న డోరా చిత్రంలో కూడా నయనతార పాత్ర సెంట్రిక్ రోల్ కాగా ఈ చిత్రానికి కూడా తమిళ, తెలుగు భాషల్లో విపరీతమైన క్రేజ్ వుంది. ఇవన్నీ పక్కన పెడితే నయనతార నటించబోయే తదుపరి ప్రాజెక్ట్ కాస్టింగ్ కే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ ఫిలిం 'ది వెడ్నెస్డే' ని తెలుగు లో కమల్ హాసన్, వెంకటేష్ లతో ఈనాడు పేరుతో రీమేక్ చేసిన దర్శకుడు చక్రి తోలేటి తాను తెరకెక్కించబోయే బైలింగ్వల్ హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం తమిళ వెర్షన్ కి నయనతారని, హిందీ వెర్షన్ కి తమన్నా ని ఎంపిక చేసుకున్నాడు. గత ఏడాది అభినేత్రితో కలిసి పని చేసిన తమన్నా, ప్రభు దేవాల కాబినేషన్ బాలీవుడ్ ప్రేక్షకులని ఆకట్టుకోవడంతో హిందీ వెర్షన్ కి ప్రభుదేవా విలన్ రోల్ లో ఫిక్స్ అయిపోయాడు. అయితే దర్శకుడు చక్రి తోలేటి తమిళ్, హిందీ భాషల్లో విలన్ ఒక్కరే ఉండాలనే ఆలోచనతో ప్రభుదేవాని అడగగా ఆయన తమిళ లోకూడా ప్రతినాయకుడి పాత్ర పోషించటానికి అంగీకరించారట. గతంలో నయన్-ప్రభుదేవాల ప్రేమాయణం ప్రభు దేవా వైవాహిక జీవితానికి విడాకులతో ముగింపు చెప్పి నయన్ తో కొత్త జీవితం ప్రారంభించటానికి సిద్దమై వారి బంధం చర్చ్ ఆవరణ వరకు వెళ్లి అక్కడ బెడిసికొట్టిన సంగతి విదితమే. అయినప్పటికీ యాక్టింగ్ ని వృతిగానే చూసే నయన్ తన సినిమాలో ప్రతినాయకుడిగా ప్రభు దేవా పేరు పరిశీలనకు వచ్చినప్పుడు ఎటువంటి అభ్యంతరాలు తెలుపకుండా దర్శక నిర్మాతల ఇష్టానికే వదిలేసిందట.

Similar News