నయన్ థ్రిల్లర్ త్రిభాషా చిత్రమేనా?

Update: 2016-11-19 04:28 GMT

నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఆమె చేస్తున్న తాజా చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ విడుదల అయింది. తమిళంలో ‘కొలైయుత్తిర్ కాలమ్’ (హత్యలకాలం) అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఫస్టలుక్ విడుదల తోనే చిత్ర యూనిట్ సక్సెస్ అయినట్టు చెప్పుకోవాలి. సినిమా టైటిల్ ద్వారా ఇది ఎలాంటి థ్రిల్లర్ అయి ఉంటుందని ప్రేక్షకులు ఊహించుకుంటారో, ఆ ఊహల్ని మరింత పెంచేలాగా ఫస్ట్ లుక్ కూడా ఇంటరెస్టింగ్ గా డిజైన్ చేశారు.

అయితే, నయనతార లీడ్ రోల్ లో ఉన్న ఈ చిత్రం త్రిభాషా చిత్రంగా తెలుగు, తమిళం, హిందీలలో విడుదల అవుతుందని కోలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. తమిళంలో ఫస్ట్ వెర్షన్ గా రెడీ అవుతున్న ఈ చిత్రానికి ఇళయరాజా కుమారుడు యవన్ శంకర్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన వాసు భగ్నాని మరో నిర్మాత. దాంతో ఆ రెండు భాషల్లో సినిమా విడుదల కావడం గ్యారంటీ. అలాగే నయనతార చేస్తున్న సినిమా గనుక, తెలుగులోనూ తమిళంతో సమానమైన మార్కెట్ ఉంటుందిగనుక ఒకేసారి మూడు భాషల్లోనూ చిత్రం విడుదల చేస్తారని అనుకుంటున్నారు.

ఇకపోతే, కమల్‌హాసన్, వెంకటేష్ లతో హిందీ చిత్రం ‘వెడ్నెస్‌డే’ కు రీమేక్ గా ఈనాడు చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు చక్రి తోలేటి .. తాజా నయనతార థ్రిల్లర్ చిత్రానికి దర్శకుడు. సాగరసంగమంలో ఫోటోస్టుడియో కుర్రాడిగా చాలా మందికి గుర్తుండే చక్రి ఈనాడు తర్వాత, సుదీర్ఘకాలం గ్యాప్ తీసుకుని ఇప్పుడు మెగాఫోన్ పట్టుకుంటున్నాడు. బహుశా ఈ చిత్రం సక్సెస్ ను బట్టి.. దర్శకుడిగా బిజీ అవుతాడేమో చూడాలి.

Similar News