దేవుడు దిగి వచ్చినా ఒక అద్భుత కలయిక?

Update: 2016-12-21 06:50 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు చేసి సంజయ్ సాహు, గౌతమ్ నంద వంటి రెండు బలమైన పాత్రలలో పవన్ కళ్యాణ్ ని నూతన శైలిలో తెరపై ఆవిష్కరించిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. జల్సా, అత్తారింటికి దారేది తరువాత వీరి కలయిక లో ముచ్చటగా మూడవ చిత్రం రానుంది. ఈ చిత్రం కోసం క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేసే ప్రయత్నాలలో ఉన్నారంట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ తరువాత త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ ల కలయిక నుంచి రానున్న చిత్రం కావటంతో చిత్రీకరణ ప్రారంభం కాకముందు నుంచే అంచనాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.

ఈ చిత్రానికి దేవుడు దిగి వచ్చినా అనే టైటిల్ పరిశీలనలో వుంది. అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన బొమ్మన్ ఇరానీ ఒక కీలక పాత్ర పోషిస్తుండగా, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించనున్నారు. ఇదే చిత్రంలో కథానాయకుడికి ధీటుగా వుండే మరో పాత్ర కోసం కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తో త్రివిక్రమ్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు త్రివిక్రమ్ కాని, నిర్మాత రాధా మోహన్ కాని ఈ విషయం పై అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో సన్ ఆఫ్ సత్యమూర్తి లో నటించిన ఉపేంద్ర, త్రివిక్రమ్ చిత్రంలో అవకాశాన్ని పైగా పవన్ కళ్యాణ్ తో తెరను పంచుకునే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు అనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిజంగానే త్రివిక్రమ్ ఉపేంద్ర డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నాడా అనేది చిత్ర బృందం గోప్యంగా ఉంచారు.

ఈ చిత్రం ద్వారా తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుద్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నాడు.

Similar News