తెలుగులో లైట్ తీసుకుంటే.... బాలీవుడ్ లో మాత్రం?

Update: 2018-03-16 05:13 GMT

ఈమధ్యన తమిళంలో హిట్ అయిన సినిమాలను నిమిషాల మీద తెలుగులో రీమేక్ చేస్తున్నారు సదరు తెలుగు హీరోలు. ఇక అక్కడ తమిళంలో గత ఏడాది బోలెడన్ని సినిమాలు మంచి హిట్స్ సాధించడమే కాదు తమిళ నిర్మాతలకు కాసుల పంట పండించాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను కేవలం తెలుగు హీరోలే కాదు... బాలీవుడ్ వాళ్ళు కూడా రీమేక్ చేసేస్తున్నారు. అయితే గత ఏడాది తమిళంలో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేద చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యాలని అనుకున్నారు. తమిళంలో మాధవన్ - విజయ్ సేతుపతి కలిసి నటించిన విక్రమ్ వేద సినిమాని తెలుగులో వెంకటేష్ - రానా కలిసి రీమేక్ చేస్తున్నారని వార్తలొచ్చాయి.

కానీ విక్రమ్ వేద తెలుగు రీమేక్ విషయం ఇంకా ఒక కొలిక్కి రాకముందే ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. దయ లేని ఓ పోలీసు ఆఫీసర్ మరియు ఓ గ్యాంగ్ స్టర్ మధ్య జరిగే కథ గా తెరకెక్కిన ఈ సినిమా రీమేక్ రైట్స్ కి మాంచి డిమాండ్ వచ్చేసింది. అయితే బాలీవుడ్ లో ఈ విక్రమ్ వేద సినిమాని వైనాట్ స్టూడియోస్ వారు రీమేక్ చెయ్యబోతుననట్లుగా తెలుస్తుంది. అలాగే తమిళ వెర్షన్ దర్శకుడే బాలీవుడ్ రీమేక్ కి కూడా దర్శకుడిగా వ్యవహరించబోతున్నారని సమాచారం. తమిళంలో విక్రమ్ వేదని పుష్కర్ - గాయత్రి లు దర్శకత్వం వహించారు.

అయితే బాలీవుడ్ లో కూడా పుష్కర్ - గాయత్రి లే ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమా దర్శక నిర్మాతల గురించిన క్లారిటీ వచ్చింది కానీ.. ఈ సినిమాలో నటించే నటీనటుల గురించిన వివరాలేమీ తెలియవు. అయితే ఈ సినిమాలో ఒక పాత్రలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కనబడనున్నాడట. మరి ఒక రోల్ లో షారుఖ్ నటిస్తే మరో రోల్ కి ఎవరైనా యంగ్ హీరో ని తీసుకోవాలనే ప్లాన్ లో దర్శకనిర్మాతలు ఉన్నారట. ఇకపోతే హీరోయిన్ విషయంలోనూ ఇంకా క్లారిటీ రాలేదంటున్నారు. మరి తమిళంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రద్ధా శ్రీనాథ్ లు ఈ సినిమాలో నటించారు. ఇక బాలీవుడ్ లో ఆ అవకాశం ఏ హీరోయిన్స్ కి దక్కుతుందో...!

Similar News