తమ్ముడితో ఐన వెంటనే అన్నకు జోడిగా నటించే ఛాన్స్ దక్కించుకుంది

Update: 2017-02-20 12:30 GMT

గత ఏడాది యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సరసన నాన్నకు ప్రేమతో చిత్రంతో సక్సెస్ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తరువాత మెగా హీరోస్ అల్లు అర్జున్ తో సరైనోడు తోపాటు రామ్ చరణ్ తేజ్ కి జోడిగా చేసిన ధ్రువ చిత్రాల సక్సెస్ లతో హ్యాట్ ట్రిక్ విజయాలు అందుకుని 2016 కి బెస్ట్ టాలీవుడ్ హీరోయిన్ గా నిలిచింది. ఇక ఈ ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో క్రేజీ ఆఫర్స్ చాలానే వున్నాయి. ప్రస్తుతానికి ఈ నెల 24 న విడుదల కాబోతున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విన్నర్ చిత్ర ప్రచార కార్యక్రమాలలో బిజీగా వున్న రకుల్, ఇదే ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటిస్తున్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

ఇప్పుడు టాలీవుడ్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కి కోలీవుడ్ కూడా వరుస అవకాశాలతో స్వాగతం పలుకుతోంది. ఇప్పటికే తమిళంలో కార్తీ సరసన తీరం అథికారమ్ ఒండ్రు చిత్రంలో నటిస్తున్న రకుల్ ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాకముందే మరో క్రేజీ ఆఫర్ ని దక్కించుకుంది. వరుస వైఫల్యాల నుంచి గత వారం విడుదలైన ఎస్-3 చిత్రంతో బైట పడ్డ హీరో సూర్య నటించబోయే తదుపరి చిత్రాలలో ఒక చిత్రానికి కథానాయికగా నటించే అవకాశం రకుల్ ప్రీత్ సింగ్ ని వరించింది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించబోతున్నారు. గతంలో సెల్వ రాఘవన్ తెరకెక్కించిన 7 జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, యుగానికి ఒక్కడు చిత్రాలలో ఆయన కథానాయికలకు హీరోలతో సమ ప్రాధాన్యం వున్న బలమైన పాత్రలనే సృష్టించారు. ఇప్పుడు అటువంటి దర్శకుడి చిత్రంలో రకుల్ అవకాశం రావటం నిజంగా రకుల్ ప్రీత్ సింగ్ అదృష్టమే.

Similar News