తండ్రులది సూపర్ హిట్ కాంబినేషన్... ఇప్పుడు తనయుల తరుణం

Update: 2017-03-02 07:35 GMT

ధ్రువ చిత్రంతో ఆశించిన ఫలితాన్ని అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆ చిత్రం పూర్తయిన వెంటనే తన తండ్రి మెగా స్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150 వ చిత్ర నిర్మాణ బాధ్యతలు నిర్వహించటంలో నిమగ్నమైపోవటంతో చరణ్ హీరోగా నటించే చిత్రానికి గ్యాప్ ఏర్పడింది. జనవరి నెలాఖరుకి ఖైదీ నెం.150 ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా పూర్తిగా ముగిసిపోవటంతో రామ్ చరణ్-సుకుమార్ ల సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి రంగం సిద్ధం అని, ఫిబ్రవరి లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావటం ఖాయం అనే అనుకుంటుండగా చెర్రీ లుక్ లో ఇంకా మార్పు కావాలని సుకుమార్ సూచించటంతో మరో నెల రోజుల పాటు రెగ్యులర్ షూటింగ్ ముహూర్తం వాయిదా పడింది.

అయితే ఈ నెల రోజుల గ్యాప్ లో సుకుమార్ అండ్ టీం రామ్ చరణ్ తేజ్ తోపాటు నటించే ఇతర తారాగణం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని కాస్టింగ్ పూర్తి చేశారు. ఈ చిత్రంలో వైభవ్ రెడ్డి ఒక కీలక పాత్ర పోషించనున్నారు. తమిళంలో కథానాయకుడిగా, ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటున్న వైభవ్ ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి తొలి సారి నటించనున్నాడు. మెగా స్టార్ చిరంజీవి-కోదండ రామ్ రెడ్డి ల కాంబినేషన్ కి వున్న సక్సెస్ రేట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ని ఒక దశాబ్ద కాలం పాటు శాసించిన ఈ సూపర్ హిట్ కాంబినేషన్ వారసులు రామ్ చరణ్-వైభవ్ రెడ్డి తొలి సారి సుకుమార్ సినిమా కోసం కలిసి పని చేయటం మెగా అభిమానులకు సినిమా ప్రారంభానికి ముందే శుభ సంకేతాలు ఇస్తుందనటంలో సందేహం లేదు. సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన జగపతి బాబు ఈ చిత్రంలో మరో కీలక పాత్రకు ఎంపికైన సంగతి తెలిసిందే.

Similar News