`డ్ర‌గ్స్‌` నేప‌థ్యంలో న‌య‌న్ `వాసుకి`!

Update: 2017-07-15 09:59 GMT

'డ్ర‌గ్స్‌' వ్య‌వ‌హారంలో టాలీవుడ్ ప‌రేషాన్ అవుతోంది. 'డ్ర‌గ్స్' డీల్‌తో సంబంధం ఉన్న‌ కొంద‌రు యువ‌హీరోలు, హీరోయిన్‌లు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు 'సిట్‌' ముందు విచార‌ణ‌కు రెడీ అవుతున్నారు. స‌రిగ్గా ఇలాంటి టైమ్‌లోనే క‌థానాయిక భావ‌న కిడ్నాప్‌, అత్యాచారం ఉదంతంలో హీరో దిలీప్ అరెస్టు మాలీవుడ్‌లో ప్ర‌కంప‌నాలు రేపుతోంది. రెండు ప‌రిశ్ర‌మ‌ల్లో ఒక‌టే క‌ల్లోలం. అయితే ఈ రెండు ప‌రిశ్ర‌మ‌ల‌తో ముడిప‌డి .. ఇదే త‌ర‌హా ఉదంతాల‌తో సంబంధం ఉన్న క‌థాంశంతో న‌య‌న‌తార క‌థానాయిక న‌టించిన‌ ఓ సినిమా ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అవ్వ‌డం హాట్ టాపిక్ అయ్యింది.

మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పుదియ నియ‌మం' తెలుగులో 'వాసుకి'గా రిలీజవుతోంది. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రాన్ని శ్రీ‌రామ్ సినిమా ప‌తాకంపై ఎస్‌.ఆర్. మోహ‌న్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ సినిమా క‌థాంశం డ్ర‌గ్స్, అత్యాచారం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తోంది. డ్ర‌గ్స్ బాధితులైన కొంద‌రు యువ‌కులు ఎలాంటి అఘాయిత్యం చేశారో తెర‌పై చూడాల్సిందేన‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ఇక‌పోతే 'డ్ర‌గ్స్‌'కి బానిస‌లైన వాళ్లు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు? అన్న‌ది ఈ సినిమాలో అద్భుతంగా పిక్చ‌రైజ్ చేశారు. మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ఈ సినిమాని, త్వ‌ర‌లోనే తెలుగులో భారీగా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

Similar News