డైరక్టర్లకు 1+1 ఆఫర్ ఇస్తున్న టాలీవుడ్

Update: 2016-12-04 01:39 GMT

కొంచెం ప్రతిభను నిరూపించుకుంటే చాలు.. తెలుగు సినీ పరిశ్రమలోని సీనియర్ హీరోలు దర్శకులను అక్కున చేర్చుకుంటున్నారు. తమను ఇంప్రెస్ చేసేలా చిత్రాన్ని రూపొందించగలిగితే… తర్వాత వరుస అవకాశాలను అదే దర్శకుడికి ఇవ్వడానికి ఎవ్వరూ వెనకాడరు. ఇది అనాదిగా ఉన్న అలవాటే. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో కొత్తగా కనిపిస్తున్న పరిణామం ఏంటంటే.. తమతో మంచి చిత్రం రూపొందించిన దర్శకుడికి సీనియర్ హీరోలు.. తమ పుత్రరత్నాలతో కూడా మరో సినిమా రూపొందించే అవకాశం ఇస్తున్నారు.

అంటే దర్శకులకు ఇండస్ట్రీ సీనియర్లు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నారన్నమాట. ఇదేదో మెగాస్టార్ చిరంజీవికి టాగూర్ వంటి హిట్ ఇచ్చిన వినాయక్ కు .. ఆతర్వాత ఎప్పటికో రాంచరణ్ తో సినిమా అవకాశం ఇవ్వడం లాగా కాదు. తన చిత్రం కాగానే.. తన కొడుకుతో చిత్రం చేయడానికి వరుస ఆఫర్ లను సీనియర్ హీరో అందిస్తున్నారు.

నిజానికి ఈ డబుల్ బొనాంజా ఆఫర్.. నాగార్జునతో మొదలైందని చెప్పాలి. యువదర్శకుడు కురసాల కల్యాణ్ కృష్ణ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ రూపొందించాడు. అది మంచి పేరు తెచ్చుకుంది. దర్శకుడికి కూడా మంచి పేరు వచ్చింది. నాగార్జున వెంటనే చైతన్యతో మరో చిత్రం చేయడానికి కల్యాణ్ కు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు కల్యాణ్ కృష్ణ- నాగచైతన్య ల చిత్రం షూటింగ్ లో ఉంది. నాగార్జున తో డెబ్యూ చిత్ర చేసిన తర్వాత.. దర్శకుడికి రెండో చిత్రమే కొడుకుతో చేస్తుండడం విశేషం.

తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన జాగర్లమూడి రాధాకృష్ణ దర్శకత్వంలో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చేస్తున్నారు. క్రిష్ పనితీరు బాగా నచ్చిన బాలకృష్ణ.. తన కొడుకు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను క్రిష్ చేతుల్లోనే పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి సీనియర్ నటులను డైరక్ట్ చేసే ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుంటే.. వారి పిల్లలతో సినిమా చేసే అవకాశం వెతుక్కుంటూ వచ్చేలా ఉందిక్కడ.

Similar News