చిరుని వాడుకుందామనుకున్నారా..?

Update: 2017-03-06 08:37 GMT

ఇప్పుడు ఎక్కడ చూసిన 'బాహుబలి' ఫీవర్ మొదలైపోయింది. 'బాహుబలి 2 ' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై వుంది. ఈ చిత్రానికి ఏప్రిల్ 28 విడుదల తేదీ ప్రకటించారు కాబట్టి అప్పటిలోగా అన్ని పనులను కంప్లీట్ చెయ్యాలనే దృఢ సంకల్పంతో పనులను వేగవంతం చేసింది రాజమౌళి అండ్ టీమ్. ఇక పబ్లిసిటీ కార్యక్రమాలను కూడా పెంచేసింది. మరి తెలుగు,తమిళం, కన్నడ, బాలీవుడ్‌ భాషల్లో తెరకెక్కించడం వల్ల ఈ ప్రాజెక్ట్ విడుదలకు చాలా టైమే పట్టేసింది. ఇక 'బాహుబలి' కోసం మూడున్నరేళ్లు కష్టపడ్డ ప్రభాస్ 'బాహుబలి' షూటింగ్ కంప్లీట్ కావడంతో ఇతర చిత్రాలపై దృష్టి పెట్టాడు. అనుష్క, రానా, తమన్నా తదితరులు 'బాహుబలి' షూటింగ్ లో పాల్గొంటూనే ఇతర సినిమాలు చేసుకుంటూ పోయారు ఒక్క ప్రభాస్ తప్ప. మరి 'బాహుబలి 1 'తోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి.

ఇన్ని అంచనాలు ఉన్న చిత్రంపై ఇప్పుడొక న్యూస్ హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవిని 'బాహుబలి' కోసం వాడుకోనున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో చక్కెర్లు కొడుతోంది. చిరుని వాడుకోవడం అంటే ఏదో అనుకునేరు..... చిరుని వాడడం అంటే చిరు వాయిస్ ని వాడుకోవాలని రాజమౌళి చూస్తున్నాడని అంటున్నారు. రాజులకాలం సీన్స్‌ని కలిపే క్రమంలో చిరు వాయిస్ అయితే దానికి బాగుంటుందని, చిరుతో చెప్పించడం వల్ల బాహుబలికి ప్రాజెక్ట్‌కి మరింత క్రేజ్ వస్తుందనేది రాజమౌళి ఆలోచనగా ప్రచారం జోరందుకుంది.

తెలుగులో చిరుతో వాయిస్ ఓవర్ చెప్పించి, తమిళం, కన్నడ, బాలీవుడ్ లలో ఆయా స్టార్ హీరోలతో వాయిస్ ఓవర్ చెప్పించడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. మరోపక్క 'బాహుబలి' కి చిరు వాయిస్ ఓవర్ అనేది కేవలం కల్పితం మాత్రమే అని.... ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని 'బాహుబలి' టీమ్ చెబుతుంది. అసలు ఎవరో కావాలనే ఈ న్యూస్ క్రియేట్ చేశారని ... 'బాహుబలి' పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని.... ఇలాంటి టైమ్ లో చిరు వాయిస్ ఓవర్ ఏమిటి అని కొట్టిపారేస్తున్నారు.

Similar News