చిత్రీకరణ పూర్తయిపోయాక లిప్ లాక్ జోడించారట

Update: 2017-02-04 05:12 GMT

డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేయటానికి వచ్చి అనుకోకుండా కథానాయకుడిగా మారిన యంగ్ హీరో రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాల నుంచి ఈడో రకం ఆడో రకం వరకు హీరోగా చేసిన ఐదు సినిమాలలో నాలుగు సినిమాలు సక్సెస్ అయ్యాయి. దానితో సీనియర్ డైరెక్టర్ వంశి దృష్టిలో పడి 80 ల దశకం లో సూపర్ సక్సెస్ ఐన కామెడీ ఎంటర్టైనర్ లేడీస్ టైలర్ కి సీక్వెల్ లో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ని రీప్లేస్ చేసే స్థాయికి ఎదిగిపోయాడు రాజ్ తరుణ్. మరో వైపు దర్శకుడిగా మారిన రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోతున్న అందగాడు చిత్రంలో అంధుడి పాత్రలో వైవిధ్యమైన నటన కనపరిచే అవకాశం దక్కటంతో రాజ్ తరుణ్ తదుపరి చిత్రాలతో యాక్టర్ గా నిరూపించుకునే పనిలో వున్నాడు.

కాగా ఈ రెండు చిత్రాలకంటే ముందుగా రాజ్ తరుణ్, అను ఇమ్మాన్యుయేల్(మజ్ను ఫేమ్) జంటగా నటించిన కిట్టు వున్నాడు జాగ్రత్త చిత్రం అన్ని కమెర్షియల్ ఎలెమెంట్స్ తో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర దర్శకుడు వంశి కృష్ణ ఎడిటింగ్ పూర్తయిపోయిన ఈ చిత్ర రషెస్ అన్నీచూసుకున్న తరువాత రొమాన్స్ పాళ్ళు తక్కువగా ఉన్నాయని అనిపించటంతో ప్రత్యేకంగా రాజ్ తరుణ్-అను ఇమ్మాన్యుయేల్ ల లిప్ లాక్ చిత్రీకరించి సినిమాలో జోడించాడట. మలయాళం నుంచి దిగుమతి ఐన భామలతో నిత్య మీనన్, నివేత థామస్, అనుపమ పరమేశ్వరన్ వంటి వారు లిప్ లాక్స్ కి దూరంగా వుంటుంటే అను ఇమ్మాన్యుయేల్ మాత్రం రెండవ చిత్రానికే రొమాన్స్ పండిస్తూ ఆ జాబితా లోనుంచి బైటకి వచ్చింది.

Similar News