ఇరు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు అజ్ఞ్యాతవాసి వృధా చేసింది

Update: 2018-01-11 11:51 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ కావటంతో అజ్ఞ్యాతవాసి చిత్రాన్ని అన్ని ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ గత బ్లాక్ బస్టర్ ల మార్కెట్ కంటే చాలా అధిక మొత్తానికి విక్రయించారు హారిక హాసిని క్రియేషన్స్ వారు. పంపిణీదారులు కూడా భారీ విజయం ఖాయం అనే భ్రమలో పోటీ పడి విడుదల హక్కులని పొందారు. ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగి హారిక హాసిని క్రియేషన్స్ వారికి ఊహించని మొత్తం టేబుల్ ప్రాఫిట్ గా మిగలడంతో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంపిణీదారులకి వీలుగా కొన్ని వెసులుబాట్లు కలిపించిన సంగతి విదితమే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి వారం రోజులు ప్రతి రోజు అర్ధ రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం పది గంటల వరకు కూడా అజ్ఞ్యాతవాసి చిత్ర ప్రదర్శనలకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయటంతో పాటు విడుదల రోజు ముందు రాత్రి నుంచే పెయిడ్ ప్రీమియర్స్ కి అనుమతులు ఇచ్చి సహకరించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా టికెట్ రేట్ల పెంపుతో పాటు రోజుకి ఒక షో అదనంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామాలన్నీ చూసి అజ్ఞ్యాతవాసి రికార్డు స్థాయిలో వసూళ్లు నెలకొల్పటం ఖాయం అని ఆశించిన అభిమానులకి తొలి రోజు వసూళ్లు ఊరట కలిగించినా రెండవ రోజు మార్కింగ్ షో నుంచి వెలవెల బోతున్న థియేటర్స్ నిరాశకి గురి చేస్తున్నాయి. చూస్తుంటే పండుగ మొదలయ్యే వరకు కూడా స్థిమితంగా అజ్ఞ్యాతవాసి వసూళ్లు ఉండేలా కనిపించటం లేదు. చాలా అరుదుగా దొరికే ప్రభుత్వాల నుంచి ప్రత్యేక అనుమతులని ఈ చిత్రం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతోంది.

Similar News