ఆ గదిలో భయపెట్టనున్న కింగ్ నాగ్

Update: 2016-11-27 10:12 GMT

మెగా స్టార్ చిరంజీవి సినిమాలకు బ్రేక్ ఇచ్చే సమయానికి ఆయనతో పాటు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సమకాలీన నటులలో నందమూరి బాల కృష్ణ, వెంకటేష్, నాగార్జున పేర్లు వినిపించేవి. తరం మారటం, ప్రేక్షకుల అభిరుచి మారటంతో ఈ హీరోలకు చాలా కాలం విజయాలు కరువు అయ్యాయి. మధ్యలో బాలయ్యకు సింహ ఊరట నిచ్చినా వెంకీ, నాగ్ లకు 2014 వరకు బాడ్ టైం కొనసాగడంతో పాటు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చింది అనే చతుర్లు కూడా ఈ ముగ్గురు స్టార్ హీరోస్ పై వినపడ్డాయి. సరిగ్గా అదే ఏడాది లెజెండ్ తో బాలయ్య, దృశ్యంతో వెంకీ, మనం తో నాగ్ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్లీ మార్కెట్ విషయంలో యువ హీరోలకు పోటీగా నిలబడ్డారు.

వీరిలో కింగ్ నాగార్జున ది ప్రత్యేక స్థానం. మనం తరువాత సుదీర్ఘ విరామం తీసుకున్నప్పటికీ విజయ పరంపర కొనసాగించే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి చిత్రాలతో హ్యాట్ ట్రిక్ విజయాలు అందుకుని ప్రస్తుతం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో భక్తి రస చిత్రం ఓం నమో వెంకటేశాయ లో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తికాక ముందే రాజు గారి గదితో సక్సెస్ అందుకున్న దర్శకుడు ఓంకార్ దర్శకత్వంలో ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కనున్న రాజు గారి గది 2 లో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడే హైదరాబాద్ లో జరిగింది. నాగ్ హారర్ స్టోరీ ఒప్పుకోవటం ఇదే తొలి సారి కావటం విశేషం.

రాజు గారి గది 2 చిత్రాన్ని పీ.వి.పీ సంస్థ నిర్మిస్తుండగా, సంభాషణలు అబ్బూరి రవి రచిస్తున్నారు. రాజు గారి గది 2 లో ఇద్దరు కథానాయికలకు చోటు ఉండగా వారి ఎంపిక ఇంకా తుది దశకు చేరుకోలేదు.

Similar News