అలా తప్పుకుంటే ఇలా దూరిపోతారట

Update: 2017-10-22 17:00 GMT

టాలీవుడ్ లో ఒక సినిమాని నమ్మి దిల్ రాజు నిర్మిస్తున్నాడు అంటే ఆ సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉంటాయో అందరికి తెలుసు. ఆయన కథను నమ్మి ప్రతి పైసా ని సినిమా కోసం ఖర్చు పెడతాడు. అయినా కూడా ఎడా పెడా ఖర్చు చేసే రకం కాదు దిల్ రాజు. ఎప్పుడూ తాను అనుకున్న బడ్జెట్ లోనే సినిమాని పూర్తి చేస్తాడు గాని... తన బడ్జెట్ దాటి మాత్రం పైసా ఖర్చు చెయ్యడు. అలాంటి దిల్ రాజు ఏకంగా శంకర్ - కమల్ హాసన్ కలయికలో 200 కోట్ల భారీ బడ్జెట్ తో 'ఇండియన్ 2' సినిమా తీస్తానని ప్రకటించడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. షాక్ అలా ఉంచితే .. చాలామంది నమ్మలేదు కూడా.

ఏకంగా కమల్ హాసన్ వ్యాఖ్యాతగా తెరకెక్కిన బిగ్ బాస్ స్టేజ్ మీద శంకర్ ని తీసుకెళ్లి మరీ 'ఇండియన్ 2 ' అనౌన్స్ చేసాడు దిల్ రాజు. అంత చేసిన దిల్ రాజు ఇప్పుడు తాజాగా బడ్జెట్ గురించి ఆలోచన చేస్తున్నాడట. అలా ఆలోచిస్తున్న దిల్ రాజు ఈ 'ఇండియన్ 2 ' ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దిల్ రాజు ని తనకి ఈ సినిమాలో వాటా ఇమ్మని... 'భారతీయుడు' సినిమా నిర్మాత ఏ ఎం రత్నం అడగడం... దానికి దిల్ రాజు మాట్లాడలేకపోయాడంటూ కూడా వార్తలొస్తున్న సమయంలో ఉప్పుడు తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి దిల్ రాజు తప్పుకున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న పెద్ద నష్టం లేదని... దిల్ రాజు కాకపోతే మరొకరనే అభిప్రాయంలో శంకర్, కమల్ హాసన్ ఉన్నట్లుగా కూడా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే దిల్ రాజు స్థానాన్ని భర్తీ చేసేందుకు '2.0' నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారు రెడీగా ఉన్నారట. మరి లైకా ప్రొడక్షన్ ప్రపోజల్ కి ఒప్పుకోవడానికి శంకర్, కమల్ లు కూడా దిల్ రాజు ఏం చెబుతాడా అని ఎదురు చూస్తున్నారట. దిల్ రాజు నేను తప్పుకున్నాననే విషయం అలా చెబితే ఇలా లైకా వారు దూరిపోవడానికి సంసిద్ధంగా ఉన్నారట. మరి చూద్దాం ఫైనల్ గా 'ఇండియన్ 2 ' ప్రాజెక్ట్ ని ఏ నిర్మాత చేతుల్లో ఉంటుందో అనేది.

Similar News