అభిమానులు పండగ చేసుకోండయ్యా

Update: 2017-12-06 11:00 GMT

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.. స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో తమ అభిమాన హీరోను చూడాలని అనుకున్న అభిమానులకు ‘సై-రా నరసింహ రెడ్డి’ అంటూ మెగాస్టార్ చిరంజీవి అలరించబోతున్నాడు. ఈ సంవత్సరం ‘ఖైదీ నంబర్ 150’ చిత్రంతో వెండితెరకు రీ-ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని ‘సై-రా నరసింహ రెడ్డి’గా చేస్తున్న సంగతి తెలిసిందే… స్వాతంత్ర్య సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి’ జీవిత కథపై ఈ చిత్రం తెరకెక్కనుంది.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రారంభమై, టాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక ఖర్చుతో రూపొందుతున్న చిత్రం. మెగాస్టార్ సహా నటీనటులు అందరికీ టెస్ట్ షూట్ లు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి.. ఇవాళ ఉదయం తొలి షాట్ పిక్చరైజేషన్ చేసేశారు. ఉదయం 7.30 గంటలకు చిరంజీవి.. కేరక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీలపై తొలి షాట్ చిత్రీకరణ చేపట్టారు. హైద్రాబాద్ పరిసరాల్లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన భారీ సెట్ లో ఈ షాట్ చిత్రీకరణ జరిగింది. తొలి షెడ్యూల్ మొత్తం ఇక్కడే షూట్ జరగనుండగా.. చిత్రంలో పలువురు నటీనటులతో పాటు.. ఇంగ్లీష్ యాక్టర్స్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం ప్రీ- ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.. సెట్లు నిర్మాణం , మాటలు తదితర విభాగాలు పనిచేస్తున్నాయి.. ఈరోజు ఉదయం ఈ చిత్రం చిత్రీకరణ మొదలుకానుండడంతో చిరు అభిమానులకు ఇది శుభవార్తే.. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ , కిచ్చ సుదీప్ , విజయ్ సేతుపతి , నయనతార , జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Similar News