అభిమాని బండి నడిపిన హీరో

Update: 2017-03-06 08:30 GMT

బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సంజయ్ దత్ హిందీ లో ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణితో చేసిన మున్నా భాయ్ ఎం.బి.బి.ఎస్, లగే రహో మున్నా భాయ్ చిత్రాల సక్సెస్ లతో దూసుకుపోతున్న తరుణంలో వివిధ కేసులలో ఇరుక్కుని జైలు జీవితం గడపాల్సి రావటంతో బాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా పోటీ ఇవ్వలేకపోయారు. ఆయన కారాగార శిక్షా కాలం ముగిసిన అనంతరం తిరిగి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో పీకే చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించి ఆ పాత్రతో తిరిగి ఫామ్ లోకి వచ్చారు. సంజయ్ దత్ కి పాత్ బ్రేకింగ్ పాత్రలు సృష్టించిన రాజ్ కుమార్ హిరానీకి తన జీవిత కథపై బయోపిక్ చేసుకునే పూర్తి స్వేచ్చని ఇచ్చి తన ఋణం తీర్చుకున్నాడు సంజయ్ దత్. ఈ బయోపిక్ పై ఇప్పటికే విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. సంజయ్ దత్ పాత్రని రణ్బీర్ కపూర్ పోషిస్తున్నారు. కాగా సంజయ్ దత్ ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న భూమి చిత్రీకరణలో బిజీలో వున్నారు.

ప్రస్తుతం ఆగ్రా లో చిత్రీకరణ జరుపుకుంటున్న భూమి చిత్ర సెట్స్ కి తమ అభిమాన నటుడిని కలవటానికి సంజయ్ దత్ అభిమానులు విచ్చేయగా, షాట్ గ్యాప్ లో అభిమానులతో కొంతసేపు ముచ్చటించి, వారికి తాను నటింస్తున్న భూమి చిత్ర వివరాలతోపాటు తన జీవిత కథపై తెరకెక్కుతున్న చిత్ర వివరాలపై కూడా స్పష్టత ఇచ్చారు. అభిమానులతో మాటా మంతీ పూర్తయిన వెంటనే తిరిగి షాట్ కి సిద్దమవుతున్న సంజయ్ దత్ ని ఒక అభిమాని తన వాహనాన్ని ఒక సారి నడపవలసినదిగా కోరగా సంజయ్ దత్ అభిమాని కోరిక మేరకు సెట్స్ లోనే ఆ అభిమాని వాహనం నడిపి అనంతరం తిరిగి షాట్ కి వెళ్లారు. సంజయ్ దత్ నడిపిన అభిమాని వాహనం హెడ్ లైట్స్ తోపాటు నిండా ఇతర లైట్స్ తో నిండి ఉండటంతో, ఈ వాహనం పై సంజయ్ దత్ వున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

Similar News