అదే తన జీవిత లక్ష్యమట!!

Update: 2017-07-23 07:00 GMT

ఈ మధ్యన వరుస ప్లాప్ లతో ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాధ్... అనుకోకుండా బాలకృష్ణ 101 వ చిత్రం 'పైసా వసూల్' ని డైరెక్ట్ చేస్తూ ఒక్కసారిగా మీడియాలో హైలెట్ అయ్యాడు. ఇక ఎప్పటికప్పుడు 'పైసా వసూల్' షూటింగ్ తో రెగ్యులర్ అపుడెట్లు ఇస్తూ ఇప్పుడు కూడా అనుకోకుండా డ్రగ్స్ కేసులో ఇరుక్కుని సిట్ అధికారులనుండి నోటీసులు అందుకుని గత 10 రోజులుగా మీడియాలోనే ఉన్నాడు. మినిట్ టు మినిట్ పూరి జగన్నాధ్ గురించి మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పూరి డ్రగ్స్ తీసుకున్నాడని... డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు కలిగి వున్నాడని.... బ్యాంకాక్ వెళ్ళేది డ్రగ్స్ కోసమే అని ఒకటేమిటి చాలా రకాల కథనాలేమీడియా ప్రచారం చేస్తూ వుంది.

మరి ఇంతగా మీడియా ఆయన మీద ఫోకస్ చేసేసరికి చిర్రెత్తుకొచ్చింది పూరికి . అందుకే మీడియా వలన తమ కుటుంబం చాలా ఇబ్బందులు పడుతుందని... అంతా మీడియానే చేసినట్లు తనదేం తప్పులేదన్నట్లు మాట్లాడాడు. మరి ఇంత జరిగినా తన యాటిట్యూడ్ ఏం మారదని.... తాను తీసే సినిమాల్లో ఎటువంటి మార్పు ఉండదని చెబుతున్నాడు. ఇక 'జనగణమన' చిత్రాన్ని తెరకెక్కించడమే తన జీవిత లక్ష్యమని చెబుతున్నాడు. సమాజంలో జరిగే ఎన్నో విషయాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తానని.... తనను ఇలా నిందలు పాలు చేసిన వారికి బుద్ది చెబుతానని... 'జనగణమన' సినిమాకి 'ఐ లవ్‌ ఇండియా ఐ హేట్‌ ఇండియన్స్‌' అనే ట్యాగ్‌లైన్‌ పెట్టి భారతదేశంలో జరిగేవన్నీ చూపిస్తానని చెబుతున్నాడు.

మరి ఇంత గట్టిగా 'జనగణమన' తీస్తానని చెబుతున్న డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి మంచి స్టార్ హీరో దొరకాలి కదా. ఎందుకంటే 'జనగణమన' కథతో కలిసిన ఇద్దరు ముగ్గురు హీరోలు ఈ కథని ఆల్రెడీ రిజక్ట్ చేసిన విషయం తెలిసిందే.

Similar News