ఎన్టీఆర్ కి పోటీగానే యాత్ర..!

Update: 2018-12-15 06:54 GMT

టాలీవుడ్ లో మహానటి బయోపిక్ సక్సెస్ అవడంతో వరసబెట్టి అనేక బయోపిక్స్ ని ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. అందులో ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకున్న బయోపిక్స్ లో ఎన్టీఆర్ బయోపిక్ ఒకటైతే మరొకటి వైఎస్సార్ బయోపిక్ యాత్ర. ఈ రెండు సినిమాల మీద రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లోనూ... ఎన్టీఆర్, వైఎస్సార్ అభిమానుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఇక ఎన్టీఆర్ బయోపిక్ ని దర్శకుడు క్రిష్ రెండు భాగాలుగా కథానాయకుడు, మహానాయకుడుగా తెరకెక్కిస్తున్నాడు. ఇక యాత్ర కూడా త్వరగానే చిత్రీకరణ జరుపుకుంది. అలాగే వైఎస్సార్ బయోపిక్ 2O19 ఎన్నికల టార్గెట్ గా వైఎస్సార్సీపీకి అనుకూలంగా తెరకెక్కుతుంది. అయితే యాత్ర సినిమా వచ్చే శుక్రవారం అంటే డిసెంబర్ 21 నే విడుదల కావాల్సి ఉండగా.. యాత్ర నిర్మాతలు సినిమాని పోస్ట్ పోన్ చేశారు.

వాయిదాలు పడుతూ...

మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్న యాత్ర సినిమాని నిర్మాతలు ఎన్టీఆర్ బయోపిక్ మీద పోటీకి విడుదల చెయ్యడానికి పోస్ట్ పోన్ చేశారు. అయితే దర్శకుడు క్రిష్, హీరో బాలకృష్ణలు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడిని చాలా చాకచక్యంగా 2019 సంక్రాంతికి విడుదలకు లాక్ చెయ్యగా... మహానాయకుడుని జనవరి 24న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అయితే మహానాయకుడు జనవరి 24 నుండి పోస్ట్ పోన్ అయ్యి ఫిబ్రవరి రెండో వారానికి వెళుతుందని ప్రచారం జరిగినప్పుడు... యాత్రని సంక్రాతి బరిలో బలి చేయ్యకుండా ఫిబ్రవరి రెండో వారంలోనే మహానాయకుడు మీదకి దింపే ప్లాన్ చేశారట యాత్ర నిర్మాతలు.

మహానాయకుడిపై పోటీగా యాత్ర...

అయితే తాజాగా మహానాయకుడుని ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నామంటూ ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతలు డేట్ లాక్ చేసే సరికి యాత్ర నిర్మాతలు కూడా యాత్ర సినిమాని ఫిబ్రవరి 8న దింపే ఏర్పాట్లు చేస్తున్నారట. మరి యాత్ర సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినా... ఎన్టీఆర్ బయోపిక్ మీది పోటీకి దింపే యోచనలోనే యాత్ర నిర్మాతలు ఉండేసరికి యాత్ర డేట్ మారుతూ వచ్చిందట. ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర రెండూ ఒకేసారి బరిలో దిగితే ఏ నిర్మాత ది పై చెయ్యి అవుతుందో... అలాగే ఎన్టీఆర్ హీరో అవుతాడో, రాజశేఖరరెడ్డి హీరో అవుతాడో అప్పుడు ప్రేక్షకులే తేలుస్తారన్న మాట.

Similar News