యువతరం ప్రేక్షకుల్లో విజయ్ దేవరకొండకి మామూలు క్రేజ్ లేదు. 'అర్జున్రెడ్డి'తో ఆయనకి మరింత మంది అభిమానులయ్యారు. వేదికలపై ఆయన మాట్లాడే మాటలు, ప్రదర్శించే యాటిట్యూడ్ కుర్రకారుకి విపరీతంగా నచ్చుతుంటాయి. అయితే ఆ తీరు చాలాసార్లు విమర్శలకి కూడా దారితీసింది. కానీ విజయ్ మాత్రం అస్సలు తొణకకుండా బెణకకుండా తన వాయిస్ని వినిపిస్తూ వచ్చాడు. అది ఆయనకి మరింత క్రేజ్ని తెచ్చిపెట్టింది తప్ప ఎప్పుడూ తగ్గించలేదు. అర్జున్రెడ్డి ఆడియో ఫంక్షన్లో సెన్సార్ బోర్డు ఏ డైలాగ్నైతే బీప్గా పెట్టిందో, దాన్ని ప్రేక్షకులతో పలికించాడు. అంత యాటిట్యూడ్ విజయ్ది. ఆ దూకుడు గీత గోవిందం ప్రమోషన్లలోనూ చూడాలనుకొన్న యువతరానికి కాస్త నిరాశ. గీత గోవిందం పాటల విడుదల వేడుకకి ముందే ఓ చిన్న షాక్ తగలడమే అందుకు కారణం. విజయ్ స్వయంగా పాడిన పాటకి విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాటలో బూతులు ఉన్నాయని, మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని పలు సంఘాలు ఆరోపించాయి.
జాగ్రత్తగా మాట్లాడాలని ఫోన్లు
ఆ వివాదం తీవ్రరూపం దాల్చేలోపే అల్లు అరవింద్ నష్టనివారణ చర్యలకి పూనుకున్నారు. యూట్యూబ్లో పాటని తొలగించేశారు. దాంతో వాతావరణం చల్లబడింది. అలాగే ఆడియో విడుదల వేడుకలోనూ ప్రసంగాలు కూల్గా ఉండాలని ముందే చిత్రబృందం నిర్ణయించుకొందట. ఆ మేరకు ఎప్పుడూ యారొగెంట్గా, ఓపెన్గా మాట్లాడే విజయ్కి కూడా ముందస్తుగానే పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఆ విషయాన్ని విజయ్ కూడా ఒప్పుకొన్నారు. 'ఈ రోజు పొద్దున్నుంచి నాకు నాలుగైదు ఫోన్లు వచ్చాయి. జాగ్రత్తగా మాట్లాడు అని అల్లు అరవింద్గారు, బన్నీ వాస్ ఫోన్లు చేస్తూనే ఉన్నార'ని చెప్పుకొచ్చాడు. దీన్నిబట్టి ఆయనకి ముందే జాగ్రత్తగా మాట్లాడాలనే వార్నింగ్ వెళ్లినట్టు అర్థమవుతోంది. అయితే తాను సహజంగానే మారిపోయానని... ఆ మార్పు ఎలా ఉంటుందో చూడాలంటే మీరంతా థియేటర్కి రావాలని తన అభిమానులకి సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు విజయ్ దేవరకొండ. మరి ఈ సినిమా హిట్టయ్యాక మళ్లీ విజయ్ యారగెన్సీ బయటికొస్తుందేమో చూడాలి.