ఎమోషనల్ అయిన విజయ్ దేవరకొండ..!

Update: 2018-08-13 13:24 GMT

గత ఏడాది రిలీజ్ అయిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ.. ఈనెల 15న 'గీత గోవిందం' సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. 'అర్జున్ రెడ్డి'కి పూర్తి భిన్నంగా ఇందులో విజయ్ కనిపించడంతో సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు అతని ఫ్యాన్స్. ఏ ఈవెంట్ కి వచ్చిన అందరినీ సరదాగా పలకరించి ఫ్యాన్స్ ను ఉతేజపరుస్తూ మాట్లాడటం విజయ్ కి ముందు నుండి అలవాటు. కానీ నిన్న వైజాగ్ లో జరిగిన 'గీత గోవిందం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు.

లింక్స్ డిలీట్ చేస్తున్నా...

అందుకు కారణం ఈ సినిమా సీన్స్ లీక్ అవ్వడమే. నాలుగు రోజులు నుండి ఈ లీక్స్ చిత్ర బృందంతో పాటు విజయ్ ని కూడా టెన్షన్ పడుతోంది. దీనిపై విజయ్ నిన్న ఫంక్షన్ లో స్పందిస్తూ... నిర్మాతలతో పాటు ఎంతో మంది ఈ సినిమా కోసం కష్టపడి..ప్రాణం పెట్టి సినిమా తీసినప్పుడు ఇలాంటివి జరగడం చాలా బాధాకరం అని ఆయన అన్నాడు. నేను ఈ స్టేజి మీదకు రావడానికి ముందు కింద కూర్చుని ఇక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా.. పైరసీ లింక్స్ మా టీంకి పంపి డిలీట్ చేయించే పనిలో ఉన్నానని..ఇది మాకు అవసరమా? అని ప్రశ్నించాడు.

పోరాటం నాకు అలవాటైంది...

నిజానికి ఈ ఫంక్షన్ కి నిర్మాత బన్నీ వాస్ రావాలి. కానీ ఆయన హైదరాబాద్ లో టీంతో కూర్చుని లింక్స్ ను డిలీట్ చేసే పనిలో ఉన్నాడని.. ఎంతో ఇష్టపడి తీసిన సినిమా గురించి ఫంక్షన్ లో మాట్లాడటానికి అవకాశం లేకుండా హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చిందని ఇది చాలా బాధాకరమని అన్నాడు. నన్ను ఎంత వెనక్కి లాగాలని ప్రయత్నించినా.. నేను బాధ పడి వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని..చిన్నప్పటి నుండి ఉనికి కోసం, ఎదగడం కోసం, గుర్తింపు కోసం పోరాటడం అలవాటైందని.. ఇప్పుడు కూడా అదే చేస్తానని చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. నేను ఎన్ని ఇబ్బందులతో ఇక్కడకి వచ్చినా.. మిమ్మల్ని చూశాక తనలోనూ జోష్ వచ్చిందని విజయ్ అన్నాడు.

Similar News