మామ అల్లుళ్ళ భామలు సెట్ అయ్యారు

Update: 2018-12-13 03:33 GMT

సురేష్ నిర్మాతగా జై లవ కుశ దర్శకుడు బాబీ దర్శకత్వంలో వెంకటేష్ - నాగ చైతన్య కలయికలో తెరకెక్కబోతున్న వెంకీ మామ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడో అంటే ఒక నెలముందే మొదలైంది. కామెడీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతున్న వెంకిమామ లో వెంకటేష్ ఫన్నీ మామాగా చైతు ఫన్నీ అల్లుడిగా నిజ జీవిత పాత్రలే పోషిస్తున్నారు. అయితే ఫస్ట్ షెడ్యూల్ నుండి నాగ చైతన్య మీద సన్నివేశాలను తెరకెక్కించిన దర్శకుడు బాబీ... ఇప్పుడు వెంకటేష్ - చైతు కాంబో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. వెంకటేష్, అనిల్ రావిపూడి ఫ్యాన్ అండ్ ప్రష్టేషన్ ఎఫ్ 2 షూటింగ్ కంప్లీట్ చేసుకుని తాజాగా వెంకీ మామా సెట్స్ లో జాయిన్ అయ్యాడు.

ఇక ఈ సినిమాలో నాగ చైతన్య కి జోడిగా సినిమా మొదలు కాకముందే రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసింది చిత్ర బృందం. కానీ వెంకటేష్ సరసన మాత్రం ఏ ఒక్క హీరోయిన్ ని సెట్ చెయ్యలేదు. అయితే మొదట్లో వెంకిమామ లో వెంకీ సరసన మరోమారు తమన్నానే అని, కాదు కబాలి భామ హ్యూమా ఖురేషి అని ప్రచారం జరిగింది. అసలైతే బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి దాదాపు ఫిక్స్ అన్నారు. అయితే హ్యూమని ఫైనల్ చేసిన చిత్ర బృందం ఆమెపై టెస్ట్ షూట్ కూడా చేశారట. ఈ సినిమా కథ ప్రకారం ఆమె చైతూకి అత్తగా కనిపించవలసి ఉంటుంది. కానీ హ్యూమా అత్త లుక్స్ అంతగా నప్పకపోవడంతో... పెళ్ళై సినిమాల్లో కూడా కొనసాగుతున్న శ్రియని ఎంపిక చేశారట.

పెళ్లయ్యాక కూడా సినిమాల్లోనే కాదు... బయట కూడా గ్లామర్ గా తిరుగుతున్న శ్రియ అయితే అత్త పాత్రకి సరిపోతుందని.. సీనియర్ హీరోల సినిమాల్లో నటించిన శ్రియ ఈ సినిమాలో వెంకీ సరసన నటిస్తే క్రేజ్ కూడా వస్తుందని బాబీ అండ్ వెంకిమామ బృందం అలోచించి శ్రియ శరన్ ని వెంకీ కి జోడిగా ఎంపిక చేసినది. మరి మామ అల్లుళ్ళ భామలు శ్రియ, రకుల్ అన్నమాట.

Similar News