మన హీరోలు రైతులకెప్పుడు హీరోలవుతారో..?

Update: 2018-06-29 07:35 GMT

ఈ మధ్యన టాలీవుడ్ హీరోలంతా రైతు సమస్యలపై తమ సినిమాల్లో ఏదో మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వారు మెసేజ్ ఇవ్వడం కన్నా.. రైతులను ఏదో విధంగా ఆదుకుంటే ఇంకా బాగుంటుంది అనే అభిప్రాయాలూ సోషల్ మీడియాలో వస్తున్నాయి. కోలీవుడ్ హీరో విశాల్ లా వీరు కూడా రైతులకు ఏదో ఒక మంచి చేస్తే బాగుంటుంది అంటున్నారు. కోలీవుడ్ హీరో విశాల్ తమిళనాడు రైతులకు తన సినిమా టికెట్స్ నుండి వచ్చే ఆదాయంలో ఒక రూపాయి రైతుల కోసం త్యాగం చేస్తున్నాడు. అలాగే అభిమన్యుడు సినిమా అప్పుడు కూడా విశాల్ తెలుగు ప్రెస్ మీట్ లో అభిమన్యుడు సినిమా టికెట్స్ నుండి వచ్చిన డబ్బుతో అంటే ఒక్కో టికెట్ నుండి ఒక్కో రూపాయి ఇక్కడి రైతుల కోసం ఇస్తానని చెప్పాడు.

కేవలం సినిమాల్లో మెసేజ్ మాత్రమే...

ఆ విధంగా రైతుల దృష్టిలో విశాల్ హీరో అయ్యాడు. మరి టాలీవుడ్ హీరోలు కూడా తమ సినిమాల్లో రైతు సమస్యలను పరిష్కారాలను చూపిస్తే సరిపోదు.. వీరు కూడా ఇక్కడి తెలుగు రైతులకు ఏదో ఒక సహాయాన్ని అందిస్తే బాగుంటుంది. ఒక కోలీవుడ్ హీరో ఇక్కడ టాలీవుడ్ కి వచ్చి ఇక్కడి రైతులను ఆదుకోగా.. ఇక్కడి హీరోలు తమ రైతులను ఆదుకోవడానికి ఎందుకు ఆలొచిస్తున్నారో అనే సెటైర్స్ కూడా పడుతున్నాయి. మరి స్టార్ హీరోలు తమ సినిమాల్లో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను అందరికీ అర్ధమయ్యేలా చూపిస్తున్నారు. చిరంజీవి ఖైది నెంబర్ 150 లో రైతు భూముల కోసం పాటు పడితే... జై లవ కుశ లో ఎన్టీఆర్ రైతుల కోసం బ్యాంక్ లు లోన్స్ ఇస్తాయని.. దళారీలను నమ్మవద్దని వివరించే ప్రయత్నం చేసాడు.

సినిమాలు మేలు చేస్తాయా..?

ఇక మహేష్ బాబు భరత్ అనే నేను లో సీఎం గా రైతు సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసాడు. తాజాగా వంశీ పైడిపల్లి సినిమాలోనూ మహేష్ రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాడే యువకుడిగా కనబడతాడనే ప్రచారం ఉంది. ఇక కోలీవుడ్ హీరో కార్తీ కూడా తెలుగులో చినబాబు గా రైతు బిడ్డగా నటిస్తున్నాడు . ఇది శుభ పరిణామమే అయినప్పటికీ... రైతులకు ఏదో ఒక రూపాన మేలు చేస్తే పర్వాలేదు కానీ.. వారికి సినిమా వలన ఉపయోగం ఉంటుందా అనేది పెద్ద క్వచ్చన్ మార్క్. మరి మన హీరోలు రైతుల దృష్టిలో ఎప్పుడు హీరోలవుతారో చూద్దాం.

Similar News