తమిళుల ఆగ్రహానికి గురైన డైరెక్టర్

Update: 2018-05-23 06:48 GMT

సౌత్ లో భారీ బడ్జెట్ సినిమాలు హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించి మెప్పించే డైరెక్టర్ శంకర్. ఇప్పుడు తాను తెరకెక్కించిన 2.ఓ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు. షూటింగ్ పూర్తై ఏడాది కావొస్తున్నా గ్రాఫిక్స్ లేట్ వలన 2.ఓ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అనేది క్లారిటీ లేకుండా పోయింది. మరోపక్క ముంబైలో జరిగే ఐపిల్ ఫైనల్ మ్యాచ్ లో 2.ఓ సినిమా ట్రైలర్ ని విడుదల చేస్తున్నట్టుగా గత రెండు రోజులుగా ఒక న్యూస్ సోషల్ మీడియా, వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వేళ డైరెక్టర్ శంకర్ మీద తమిళ తంబీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంత జరుగుతుంటే...మ్యాచ్ పై ట్వీట్టా..?

తమిళులకు శంకర్ మీద అంత కోపం రావడానికి కారణం, గత 100 రోజులుగా తూత్తుకుడిలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ పనులను వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే మంగళవారం అక్కడి ప్రజల మీద పోలీస్ లు లాఠీ ఛార్జ్ తో పాటుగా ఫైరింగ్ కూడా చెయ్యడంతో 11 మంది తమిళులు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది తీవ్ర గాయాల పాలయ్యారు. అదే సమయంలో నిన్న మంగళవారం చెన్నై, హైదరాబాద్ ల మధ్యన ఫైనల్ కోసం హోరాహోరీ మ్యాచ్ జరిగింది. అయితే శంకర్ తూత్తుకుడి ఘటన విషయంలో ఏం మాట్లాడకుండా ఐపీఎల్ లో చెన్నై నేరుగా ఫైనల్ కి దూసుకెళ్లడంతో శంకర్ 'వాట్ ఏ మ్యాచ్' అంటూ ట్వీట్ చేశాడు.

వెంటనే డిలీట్...

అయితే తూత్తుకుడిలో 11 మంది తమిళ ప్రజలు ప్రాణాలు కోల్పోతే పట్టించుకోకుండా మ్యాచ్ ను ఎంజాయ్ చేశావా? అంటూ తీవ్ర స్థాయిలో శంకర్ మీద తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమిళుల ఆగ్రహానికి తత్తరపడ్డ శంకర్ వెంటనే తాను చేసిన 'వాట్ ఏ మ్యాచ్' ట్వీట్ ని డిలీట్ చేసాడు.

Similar News