సమంత సై అంటుందా..!

Update: 2018-08-03 08:08 GMT

పెళ్ళికి ముందు నుండే హీరోయిన్ సమంత కాస్త వైవిద్యం ఉన్న పాత్రల్లో నటించాలని ఉందని అని చెప్పేది. సమంత అన్నట్లుగానే గత ఏడాది ఆమె సినిమాలేవీ పెద్దగా రాలేదు కూడా. ఇక పెళ్ళికి ముందు ఒప్పుకున్నమూడు వైవిధ్యభరిత చిత్రాలు పెళ్లి తర్వాత విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రంగస్థలంలో డీగ్లామర్ పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా రామలక్ష్మి పాత్రలో అదరగొట్టిన సమంత... మహానటి సినిమాలో నత్తి ఉన్న జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో మెప్పించింది. ఇక తమిళంలో విశాల్ సరసన అభిమన్యుడు సినిమాలో రొటీన్ పాత్ర సైకియాట్రిస్ట్ పాత్రలో నటించింది. ఆ చిత్రం కూడా మంచి విజయం సాధించింది.

వరుస విజయాలతో ఉన్న సమంత

తాజాగా యు - టర్న్ అనే థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమాలో జర్నలిస్ట్ గా మరోమారు తన ప్రతాపం చూపబోతున్న సమంత.. తమిళ సీమ రాజు చిత్రంలో మరోసారి ట్రెడిషనల్ పాత్రలో కనిపించనుంది. ఇక పెద్దగా సినిమాలు ఒప్పుకోకుండా సెలెక్టెడ్ గా సినిమాలు ఒప్పుకుంటున్న సమంత.. నందిని రెడ్డి దర్శకత్వంలో మరో వైవిద్యమైన కథలో నటిస్తుందని టాక్ వినబడుతుంది. ఎప్పటినుండో నందిని రెడ్డి, సమంత మధ్ కథా చర్చలు జరుగుతున్నాయని.. 2014లో వచ్చిన కొరియన్ మూవీ మిస్ గ్రానీకి రీమేక్ గా ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు.

70 ఏళ్ల వృద్ధురాలిగా...

అయితే కథ ప్రకారం ఈ సినిమా లోని ప్రధాన పాత్రధారి 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపిస్తూ ఉంటుంది. అతీత శక్తులను కలిగిన ఆమె అవసరమైనప్పుడు యవ్వనవతిగా మారిపోతూ ఉంటుంది. అలాంటి పాత్రలో సమంత నటిస్తే బాగుంటుందని.. నందిని రెడ్డి ప్లాన్ అంటున్నారు. మరి నందిని చెప్పిన ఈ కథకు కనెక్ట్ అయ్యి... ఈ వైవిద్యభరితమైన క్యారెక్టర్ చేస్తుందా అని డౌట్ ఉన్నప్పటికీ... సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాలను చూస్తుంటే మాత్రం కచ్చితంగా ఈ పాత్ర చెయ్యడానికి సమంత ముందుకు వస్తుందని అంటున్నారు. చూద్దాం సమంత ఈ పాత్రకి సై అంటుందో లేదో అనేది.

Similar News