ధృవ్ కోసం ఫిదా పోరినే పట్టాడా..?

Update: 2018-08-08 08:12 GMT

టాలీవుడ్ లో దర్శకుడు శేఖర్ కమ్ములకు ఒక డిఫరెంట్ స్టయిల్ ఉంటుంది. అన్నీ లవ్ ఫీల్ తో కూడుకున్న సినిమాలే శేఖర్ కమ్ముల చేస్తాడంటారు. మధ్యలో రానా లాంటి హీరోతో ఒక పొలిటికల్ మూవీ కూడా తీసాడు లెండి. అయినా శేఖర్ కమ్ముల మొదటి సినిమా నుండి నిన్నగాక మొన్నొచ్చిన ఫిదా సినిమా వరకు శేఖర్ కమ్ముల స్టయిల్ అడుగడుగునా కనిపిస్తుంది. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా ఇలా అన్ని సినిమాలో హీరోయిన్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ.. కథలోని ప్రేమను ఎంతో చక్కగా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెబుతాడు. అయితే ఆయన సినిమాలు సూపర్ డూపర్ అనే హిట్స్ అవ్వకపోయినా... మంచి ఫీల్ గుడ్ సినిమాలైతే అవుతాయి.

ధృవ్ ను తెలుగుతెరకు పరిచయం...

ఫిదా తర్వాత ఇంకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టని శేఖర్ కమ్ముల కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ ని తెలుగులో తన సినిమా ద్వారా పరిచయం చెయ్యబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే శేఖర్ కమ్ముల చెయ్యబోయే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఒక ప్రేమ కథా చిత్రంగానే ఉండబోతుంది. నిజంగానే విక్రమ్ కొడుకు ధృవ్ ని శేఖర్ కమ్ముల తన సినిమాతోనే తెలుగు తెరకు హీరోగా పరిచయం చేయబోతున్నాడని.. అలాగే తనని మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చిన భానుమతి.. అదేనండి ఫిదా పోరి సాయి పల్లవిని ధృవ్ కి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల తీసుకోబోతున్నాడనే టాక్ వినబడుతుంది.

ఓకే చెప్పిన సాయి పల్లవి

ఫిదా లో సాయి పల్లవి పాత్రని తెలంగాణ పోరి భానుమతిగా తీర్చి దిద్దిన శేఖర్ కమ్ముల దానికి తగ్గ ఫలితం అందుకున్నాడు. ఆ సినిమాకి శేఖర్ కమ్ముల కన్నా ఎక్కువగా సాయి పల్లవికి మంచి పేరొచ్చింది. ఇక ఇప్పుడు కూడా ధృవ్ కి హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకోవడమే తడువుగా.. శేఖర్ కమ్ముల సాయి పల్లవిని కలవడం... ఆమెకు కథను వినిపించడం.. సాయి పల్లవి ఓకే చెప్పడం జరిగిపోయాయని.. ఇక సాయి పల్లవి డేట్స్ కేటాయించడమే తరువాయి ఈ సినిమా ప్రారంభమవడానికి అని చెపుతున్నారు. ఇకపోతే ఈ సినిమాని శేఖర్ కమ్ముల స్వయంగా తన సొంత బ్యానర్ పై నిర్మిస్తుండడం విశేషం.

Similar News