#RRR విషయంలో అదే నిజం అయింది..!

Update: 2018-11-13 08:32 GMT

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ #RRR. ఈ చిత్రం కోసం అటు రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల పాటు మెగా - నందమూరి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈనెల 11న ఈ సినిమా అత్యంత గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా... కే.రాఘవేంద్ర రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. భారీ అంచనాలతో ప్రారంభం అయిన ఈ చిత్రం ఈనెల 19 నుండి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో షూటింగ్ జరుపుకోనుంది. స్టార్టింగే ఈ సినిమాలోని భారీ యాక్షన్ ఎపిసోడ్ ని తెరకెక్కించేందుకు జక్కన్న ప్రణాళికలు సిద్ధం చేశారు.

విజయేంద్ర ప్రసాద్ కథతో...

'బాహుబలి' తరువాత చేస్తున్న చిత్రం కాబట్టి జక్కన్న ఎటువంటి స్టోరీతో వస్తున్నాడు అని క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఇంతకీ ఆ కథ ఏంటి..? అన్న డిస్కషన్ మెగా-నందమూరి అభిమానుల్ని వేడెక్కిస్తోంది. ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుండే స్టోరీపై రకరకాలుగా వార్తలు వచ్చాయి. అందులో ఇదొక పీరియాడికల్ మూవీ అని... ఇందులో చరణ్ - ఎన్టీఆర్ బాక్సర్లుగా నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళి యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథాంశాన్ని ఎంచుకున్నాడని తెలుస్తుంది. ఇది దొంగా పోలీస్ కథ అంట. ఈ కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించారు.

దొంగగా ఎన్టీఆర్... పోలీస్ గా చరణ్

ఇటువంటి కథ అయితే అన్ని భాషల్లో రిలీజ్ చేసుకోవచ్చని రాజమౌళి భావిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇందులో దొంగగా ఎన్టీఆర్, పోలీస్ గా చరణ్ నటించనున్నారు. ఇందులోనే బాక్సింగ్ నేపథ్యం ఇన్ బిల్ట్ చేశారట. ఇది 1920 నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఇందులో చరణ్ - ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. ఈ నెల 19 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఆరంభమే ఎన్టీఆర్ - చరణ్ పై దొంగా పోలీస్ ఛేజ్ దృశ్యాల్ని తీస్తున్నారన్న చర్చ సాగుతోంది. దీంతో ఇప్పుటినుండే ఇందులో ఎన్టీఆర్ - చరణ్ ఎలా ఉండబోతున్నారని క్యూరియాసిటీ మొదలైంది మెగా - నందమూరి అభిమానుల్లో. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు.

Similar News