రజినీకి జోడిగా సీనియర్ హీరోయిన్..?

Update: 2018-05-25 05:45 GMT

రజినీకాంత్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉంటారో తెలియదు గానీ సినిమాల విషయంలో మాత్రం యమా జోరు పెంచేసాడు. ప్రస్తుతం రజినీకాంత్ నటించిన 'కాలా' సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన '2.ఓ' కూడా షూటింగ్ పూర్తి చేసుకుని గ్రాఫిక్స్ వర్క్స్ తో బిజీగా ఉంది. అయితే రజినీకాంత్ ప్రస్తుతం కోలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్ లు మొదలు పెట్టబోతున్నాడు. రజిని 162 ఫిలిం కార్తీక్ సుబ్బ‌రాజు దర్శకత్వంలో అతి త్వరలోనే పట్టాలెక్కబోతుంది. అయితే ఈ సినిమాలో రజినీకి జోడిగా ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో నటించిన సిమ్రాన్ నటించబోతున్నట్లుగా టాక్.

కోడై కూస్తున్న కోలీవుడ్ మీడియా...

గతంలో బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి వంటి స్టార్స్ తో దున్నేసిన సిమ్రాన్ పెళ్లిచేసుకుని పిల్లల్ని కని సినిమాలకు దూరమైంది. అయితే గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సిమ్రాన్ కోలీవుడ్ నుండి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా సిమ్రాన్ రజినీకాంత్ 162 ఫిలిం లో నటించబోతుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటుగా మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. కార్తీక్ సుబ్బ‌రాజు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం లో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కూడా ఒక కీ రోల్ లో కనబడబోతున్నాడట.

ఈ జోడీలే ప్రధాన ఆకర్షణ..

ఇక రజినీకాంత్ కి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ జోడి కడుతుంటే, యంగ్ హీరో విజయ్ సేతుపతి సరసన కీర్తి సురేష్ నటించబోతుంది అని ప్రచారం మొదలైంది. మహానటి తో మంచి ఊపు మీదున్న కీర్తి సురేష్ ప్రస్తుతం కోలీవుడ్లో పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది. ఇక రజినీకాంత్ మూవీ లో విజయ్ సరసన కీర్తిసురేష్ నటిస్తే ఆమెకున్న క్రేజ్ మరింతగా పెరుగుతుంది. మరి ఇదే గనక నిజమైతే రజిని - సిమ్రాన్, విజయ్ సేతుపతి - కీర్తి ల జోడీలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచేటట్లుగా కనబడుతున్నాయి.

Similar News