నాతో ఇటువంటి సినిమాలు చేయిస్తారా...

Update: 2018-08-02 10:21 GMT

హీరోయిన్ పూజ హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ముకుంద, ఒక లైలా కొసం వంటి యావరేజ్ సినిమాలు తీసిన ఆమెకు దువ్వాడ జగన్నాధం మంచి బ్రేక్ ఇచ్చింది. దీంతో మహేష్ బాబు 25వ సినిమాలో, జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేస్తున్న అరవింద సమేత సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. మొత్తానికి స్టార్ హీరోయిన్ రేంజ్ కి పూజ చేరుకుంది. అయితే, ఇదే సందర్భంలో యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఆమె సాక్ష్యంలో నటించింది. బెల్లంకొండ శ్రీనివాస్ కి ఇంతవరకు భారీ హిట్లేమీ లేవు. అయితే, భారీ పారితోషకం ఆఫర్ చేసినందుకే పూజ హెగ్డే ఈ సినిమా చేసిందనే ప్రచారం ఫిలిం సర్కిల్స్ లో జోరుగా సాగింది.

సిబ్బంది ఒత్తిడి వల్లే...

కానీ, తాజాగా సమాచారం ప్రకారం పూజ లోకల్ మేనేజర్, పీఆర్ బృందం ఒత్తిడితోనే పూజ ఈ సినిమా చేయాల్సి వచ్చిందని తెలిసింది. ఈ సినిమా చాలా ప్రత్యేకమైనదని, మంచి పేరొస్తుందని, ఇందులో నటించాలని పూజకి వారు నచ్చజెప్పారంట. దీనికి అంగీకరించిన ఆమె ఇందులో నటించింది. తీరా సినిమా యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. పూజకు కొత్తగా పేరొచ్చే బదులు ఉన్న ఇమేజ్ సైతం తగ్గింది. దీంతో ఆమె ఈ సినిమా చేయాలని చెప్పిన తన సిబ్బందిని ఎడాపెడా వాయించిందట. తనతో ఇలాంటి సినిమాలు చేయిస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేసిందట. మరోసారి ఇటువంటి కథలు తీసుకురావద్దని గట్టిగానే హెచ్చరించిందని సమాచారం.

Similar News