ఎందుకు అవసరాలను తప్పించారు..?

Update: 2018-08-01 08:00 GMT

టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ని క్రిష్ - బాలకృష్ణలు పరిగెత్తిస్తున్నారు. ఎన్టీఆర్ బయో పిక్ ఓపెనింగ్ అప్పటి నుండి చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం ఎటువంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా షూటింగ్ జరిపించేస్తున్నాడు. క్రిష్ దర్శకుడిగా అనుకుంది మొదలు ఎన్టీఆర్ బయోపిక్ స్పీడందుకుంది. బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ నటజీవితంలో ఎన్ని పాత్రలకైతే మంచి పేరొచ్చిందో అన్ని పాత్రలను ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ వెయ్యబోతున్నాడు. అంటే కృష్ణుడు, శ్రీరాముడు, దుర్యోధనుడు, కర్ణుడు, అర్జునుడు... మేజర్ చంద్రకాంత్ వంటి పేరున్న పాత్రలన్నిటిని బాలకృష్ణ కూడా ఈ సినిమా లో చేస్తాడు. అంటే దాదాపుగా 66 పాత్రలు వేస్తాడని తెలుస్తుంది.

ముందు శ్రీనివాస్ అవసరాల అనుకున్నా...

ఎన్టీఆర్ మొదటి భార్య పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుంది. ఇప్పటికే ఆమె పాత్ర తాలూకు చిత్రీకరణ ముగిసింది. ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, నరేష్ వంటి మేటి నటులు కూడా భాగమవుతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఒక పాత్ర కోసం శ్రీనివాస్ అవసరాలను ఎంపిక చేసినట్లుగా వార్తలొచ్చాయి. శ్రీనివాస్ అవసరాల సినిమాలకు డైరెక్షన్ చేసుకుంటూనే అనేక సినిమాల్లో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా మహానటి మూవీ లో ఎల్.వి.ప్రసాద్ పాత్రలో అదరగొట్టాడు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లోనూ ఎల్.వి.ప్రసాద్ పాత్రని అవసరాలే చేస్తున్నాడన్నారు.

తాజాగా అదేపాత్రకి బెంగాలీ నటుడిని

కానీ తాజాగా అవసరాలను తప్పించి ఆ పాత్రకి వేరెవరినో క్రిష్ - బాలకృష్ణలు ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. ఎల్.వి.ప్రసాద్ పాత్రకి బెంగాలీ నటుడు జిస్సు సేన్ గుప్తని క్రిష్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అవసరాల శ్రీనివాస్ ని క్రిష్ ప్రిఫర్ చెయ్యగా.. బాలకృష్ణ వద్దనేశాడనే టాక్ అయితే నడుస్తుంది. కారణాలు సరిగ్గా తెలియవు కానీ ఎల్.వి.ప్రసాద్ పాత్ర నుండి అవసరాల మాత్రం అవుట్ అయ్యాడట. ఇకపోతే ఇంకా కొంతమంది నటీనటుల ఎంపిక ఎన్టీఆర్ బయోపిక్ గురించి జరుగుతూనే ఉంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికల్లా పూర్తికి చేసి విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.

Similar News