మణిరత్నం ఆఫీస్ పై బాంబులేస్తారట..!

Update: 2018-10-02 08:29 GMT

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం చాన్నాళ్లకి నవాబ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. గత నెల 28న గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతూ.. కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఇక తెలుగులో హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్స్ పర్వాలేదనిపిస్తుండగా... ఓవర్సీస్ లో నవాబ్ హవా జోరుగా వుంది. అరవింద స్వామి, విజయ్ సేతుపతి, శింబు వంటి హీరోలతో మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్నదమ్ముల మధ్య అనుబంధాలు, కొట్లాటలు వంటి కాన్సెప్ట్ తో తెరక్కేకింది. ఇక నవాబ్ సినిమా తమిళ తంబీలకు విపరీతంగా నచ్చేసి విమర్శకుల మన్ననలు పొందుతుంది. అలాగే కలెక్షన్స్ పరంగా నవాబ్ సినిమా తమిళనాట దాదాపుగా 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

డైలాగ్ ఎంటో చెప్పకుండా...

అయితే గతవారమే విడుదలైన ఈ సినిమా విషయంలో ఇప్పుడొక సమస్య వచ్చిపడింది. విడుదలైన ఇన్ని రోజులకు ఆ సినిమాలో అభ్యంతరకర డైలాగ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అది కూడా గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులు మణిరత్నం ఆఫీస్ కి ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారట. కనీసం ఆ సినిమాలో ఏ డైలాగ్ అభ్యంతరకరంగా ఉందో చెప్పకుండా బెదిరిస్తున్నారట. అసలా డైలాగ్ ఏమిటనేది చెప్పకుండా ఆ డైలాగ్ గనక తొలగించకపోతే.. మణిరత్నం ఆఫీస్ ని బాంబులు వేసి మరీ పేల్చేస్తామని బెదిరిస్తున్నారట.

బాంబు పెట్టి పేల్చేస్తామని...

చెన్నైలోని అభిరామపురంలో ఉన్న మణిరత్నం కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బాంబులతో పేల్చేస్తామని బెదిరిస్తున్న సంగతి మణిరత్నం ఆఫీస్ స్టాఫ్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా... మణి కార్యాలయానికి పోలీసులు భద్రతను కల్పించారట. మరి భారీ హిట్ దిశగా దూసుకుపోతున్న ఈ సినిమాకి ఇప్పుడు ఇలాంటి ఫోన్ కాల్స్ రావడంతో.. మరింతగా పబ్లిసిటీ పెరిగి సినిమాకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయంటున్నారు మణి అభిమానులు.

Similar News