మహేష్ కథ వింటుంటే.. ఎక్కడో విన్నట్టుందే...?

Update: 2018-05-31 04:34 GMT

మహేష్ బాబు ఇప్పుడు వంశి పైడిపల్లి దర్శకత్వంలో తన 25 వ సినిమా షూటింగ్ కోసం సమాయత్తమవుతున్నారు. వచ్చేనెల 10 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకుని సెట్స్ మీదకెళ్లబోతుంది. వంశి దర్శకత్వంలో మహేష్ బాబు కొత్తగా సరికొత్తగా గెడ్డం లుక్ తో కనబడబోతున్నాడు. భరత్ అనే నేను విజయంతో విదేశాల్లో ఎంజాయ్ చేసిన మహేష్ బాబు తన 25 వ సినిమా కోసం మేకోవర్ అవుతున్నాడు. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా డీజే భామ పూజ హెగ్డే నటిస్తుంది. అలాగే కామెడీ హీరో అల్లరి నరేష్ మరో కీలకపాత్రలో నటించబోతున్నాడు.

అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకునేది హైదరాబాద్ లో కాదు.. మహేష్ - వంశి ల సినిమా మొదటి షెడ్యూల్ ను డెహ్రాడూన్ లో ప్లాన్ చేశారు. ముఖ్యమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. అయితే ఈ సినిమా లో మహేష్ అండ్ అల్లరి నరేష్ లు స్నేహితులుగా నటించబోతున్నారనే విషయం తెలిసిందే. అయితే మహేష్ కోటీశ్వరుడిగా ఈ సినిమా లో కనిపిస్తే.... బాగాపేదవాడైన అల్లరి నరేశ్ మహేష్ కి ప్రాణ మిత్రుడిగా పాత్ర ఉండబోతోందనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.

మరి మహేష్ కోటీశ్వరుడిగా, అల్ల్లరి నరేష్ పేదవానిగా కనబడుతూ.. ప్రాణ స్నేహితులుగా నటిస్తున్న ఈ స్టోరీ లైన్ వింటుంటే.. ఎక్కడో ఎప్పుడో విన్నట్టుగా అనిపిస్తుంది. అదేనండి వెంకటేష్, సుమన్ లు కలిసి నటించిన కొండపల్లి రాజా స్టోరీ లైన్ కూడా మనం పైన చెప్పుకున్నదానికి దగ్గరగానే ఉంటుంది. అందులో సుమన్ కోటీశ్వరుడైతే... వెంకటేష్ పేదవాడు. మరి సుమన్, వెంకటేష్ లు కూడా ప్రాణ స్నేహితులే. కాకపోతే వంశి పైడిపల్లి స్టోరీ లైన్ లో మహేష్ కోటీశ్వరుడైతే... అల్లరి నరేష్ పేదవాడు. మరి వంశి పైడిపల్లి ఈ కథని ఎంత కొత్తగా చూపిస్తాడో చూడాలి. ఇకపోతే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ పనిచేస్తున్నాడు. ఇప్పటికే దర్శక నిర్మాతలు కలిసి నాలుగు ట్యూన్స్ ను కూడా ఫైనలైజ్ చేశారట

Similar News