అశ్వినీదత్ కి, ఎన్టీఆర్ కి మధ్య అనుబంధం వేరే చెప్పేది కాదు. కానీ ఎన్టీఆర్ తో నిర్మించిన శక్తి సినిమాతో అశ్వినీదత్ కి నిర్మాతగా కోలుకోలేని దెబ్బ తగిలింది. మళ్లీ మహానటి మూవీతో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సినిమాలు నిర్మించడం మొదలు పెట్టాడు అశ్వినీదత్. అయితే మహేష్ మహర్షి సినిమాని వన్ అఫ్ ద పార్టనర్ గా చేస్తున్న అశ్వినీదత్ నాని, నాగార్జున ల దేవదాస్ మల్టీస్టారర్ సినిమాని నిర్మించాడు. ఆ సినిమా ఈ నెలాఖరుని విడుదల కాబోతుంది. ఇక అశ్వినీదత్ నిర్మాతగా బాగా యాక్టివ్ కాబోతున్నాడు. అందుకే... ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న విజయ్ దేవరకొండతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాలు నిర్మిస్తున్నట్టుగా ప్రకటించాడు అశ్వినీదత్.
తమిళ దర్శకుడికి అడ్వాన్స్...
అయితే వైజయంతి బ్యానర్ లో తమిళ దర్శకుడు అట్లీకి ఇప్పటికే అశ్వినీదత్ ఒక సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చినట్టుగా వార్తలొస్తున్నాయి. అయితే అట్లీకి అడ్వాన్స్ ఇచ్చింది... ఎన్టీఆర్ సినిమా చెయ్యడానికే అనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. మెర్సల్ సినిమా సమయంలోనే ఎన్టీఆర్ కి, అట్లీ కి మధ్య సంప్రదింపులు జరిగినట్లుగా ప్రచారమైతే జరిగింది. ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉండడం వల్ల.. అట్లీకి సమయం కేటాయించలేకపోయాడు. అట్లీ కూడా ప్రస్తుతం తన సినిమాలతో తాను బిజీగా ఉన్నాడు. అందుకే ఎన్టీఆర్ - అట్లీ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అయితే తాజాగా వైజయంతి బ్యానర్ నుండి ఎన్టీఆర్ దగ్గరుండి అట్లీకి మహానటికి ముందే అడ్వాన్స్ ఇప్పించినట్లుగా తెలుస్తుంది.
తర్వాత విజయ్ దేవరకొండ కూడా...
మరి ఎన్టీఆర్ తో అట్లీ సినిమా చెయ్యాలంటే.. ప్రస్తుతం అరవింద సమేత పూర్తి కావాలి. అలాగే రాజమౌళితో చెయ్యబోయే ఎన్టీఆర్ - చరణ్ ల మల్టీస్టారర్ పూర్తి కావాలి. మరి రాజమౌళి మల్టీస్టారర్ పూర్తి కావడానికి రాజమౌళి ఎంత టైం తీసుకుంటాడో... ఆ సినిమా లో నటిస్తున్న హీరోలకు కూడా క్లారిటీ ఉండదు. మరి వైజయంతి బ్యానర్ లో అట్లీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించేది మాత్రం 2020లోనే అవ్వొచ్చంటున్నారు. ఇక విజయ్ దేవరకొండ కోసం కూడా వైజయంతి బ్యానర్ కథలు సిద్ధం చేస్తుందట. చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యాకే వైజయంతి బ్యానర్ లో నటిస్తాడట విజయ్.