తేజ్ దెబ్బకు రీ షూట్ చేస్తున్నారా..?

Update: 2018-07-24 06:40 GMT

శర్వానంద్ 'మహానుభావుడు' సినిమా తర్వాత హిట్ డైరెక్టర్ కి అవకాశం ఇస్తాడనుకుంటే... 'లై' సినిమాతో డిజాస్టర్ ఇచ్చిన హను రాఘవపూడికి అవకాశం ఇచ్చాడు. హను రాఘవపూడి కూడా మంచి స్టోరీ లైన్ తో శర్వానంద్ ని పడేశాడు. ఇక శర్వానంద్ - హను కాంబోలో సాయి పల్లవి హీరోయిన్ గా 'పడి పడి లేచే మనసు' సినిమా పట్టాలెక్కడమే కాదు.. షూటింగ్ కూడా శరవేగంగానే జరుపుకుంటుంది. దేశభక్తి నేపథ్యంలో మిళితమైన ప్రేమ కథ గా ఈ సినిమాని హను రాఘవపూడి తీర్చిదిద్దుతున్నాడు. అయితే ఈ సినిమా పోస్టర్స్ లో సాయి పల్లవి, శర్వానంద్ ల కెమిస్ట్రీ చూసాక సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. అయితే అంచనాలు భారీగా వున్నా ఈ సినిమాకి సంబంధించిన విషయాలు మాత్రం బయటికి రావడం లేదు.

కథ ఒకేలా ఉండటంతో...

ఇదే అదునుగా హను రాఘవపూడి 'పడి పడి లేచే మనసు' సినిమాకి రీ షూట్ చేస్తున్నాడని.. గత నెలలో వచ్చిన 'తేజ్ ఐ లవ్ యూ' సినిమాలోని స్టోరీ లైన్ కి 'పడి పడి లేచే మనసు' స్టోరీ లైన్ కి దగ్గర సంబంధం ఉందని.. అసలు ఆ సినిమాలోని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కి మెమరీ లాస్ ఉన్నట్టుగానే... 'పడి పడి లేచే మనసు' సినిమాలో హీరో శర్వానంద్ కి మెమొరీలాస్ ఉంటుందట. మరి రెండు సినిమాల కథలకు దగ్గర పోలిక ఉండడంతోనే దర్శకుడు హను రఘవపుడి 'పడి పడి లేచే మనసు'కు రిపేర్లు చేస్తున్నాడనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇక 'తేజ్ ఐ లవ్ యూ' కథ ప్రేక్షకులను ఆకట్టుకోలేక విఫలమవడంతో.. హను తన సినిమా లో కొత్తగా మార్పులు చేర్పులు చేస్తున్నాడట.

సినిమాపై నమ్మకం వచ్చాకే

సినిమా మీద కాన్ఫిడెన్స్ వస్తేనే హను మళ్లీ సెట్స్ పైకి వెళతారట. మరి సినిమా విషయంలో ఎలాంటి న్యూస్ బయటికి పొక్కకుండా చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటుందట. ఎంతగా జాగ్రత్త పడినా ఇలాంటి విషయాలు అంటే ఇలాంటి ఆసక్తికర వార్తలు నిమిషాల్లో మీడియాలో పాకిపోతాయి. మరి ఈ న్యూస్ మీద హను, శర్వాల స్పందనేమిటో....!

Similar News