2.ఓ కి కొత్త తలనొప్పి..!

Update: 2018-11-10 08:59 GMT

ఇప్పుడు సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో.. సినిమాల విషయంలో పైరసీ భూతం కూడా అంటే అభివృద్ధి చెందింది. చిన్న సినిమాల విషయంలో నిర్మాతల పరిస్థితి ఏమో కానీ... భారీ బడ్జెట్ సినిమాల విషయంలో పైరసీ భూతం కారణంగా నిర్మాతలు వణికి పోతున్నారు. అన్నిటికన్నా ఎక్కువగా సౌత్ లోనే ఈ పైరసీ భూతం బాగా పాతుకుపోయింది. తమిళనాట అయితే మరీను. స్టార్ హీరోలకు, భారీ నిర్మాతలకు ఈ పైరసీ భూతం ఛాలెంజ్ విసురుతుంది అంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది. సినిమా ఇలా థియేటర్స్ లోకి వచ్చిందో లేదో.. అలా సినిమా పైరసీ భారిన పడుతుంది.

పైరసీ చేస్తామని ట్వీట్...

నిన్నగాక మొన్న తమిళంలో పందెంకోడి 2, సర్కార్ సినిమాలు విడుదలైన మూడు గంటల్లోనే పైరసీ అయ్యాయి. సర్కార్ సినిమాను ఫస్ట్ షో ముగిసే సమయానికే తమ వెబ్‌సైట్లో రిలీజ్ చేసింది తమిళ్ రాక్స్. ఈ పైరసీ వలన నిర్మాతలే కాదు.. సినిమా ఇండస్ట్రీ కూడా కొన్ని కోట్ల నష్టానికి గురవుతుంది. తాజాగా తమిళ్ రాక్స్ విసిరిన సవాల్‌తో తమిళ ఫిల్మ్ ఇండస్ర్టీలో ఆందోళన మొదలైంది. రజనీకాంత్- శంకర్ కాంబోలో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2.0 సినిమాని విడుదలైన కొద్దిసేపట్లోనే తాము విడుదల చేస్తామంటూ తమిళ రాక్స్ ట్విట్టర్‌లో ఓ మెసేజ్ కనిపించింది. ఆ మెసేజ్ చూసిన 2.ఓ టీం కి టెన్షన్ పట్టుకుంది.

ఎన్ని ప్రయత్నాలు చేసినా...

2.ఓ గనక పైరసీ బారిన పడితే రాబడికి భారీగా గండిపడే అవకాశం లేకపోలేదు. నిర్మాతలు భారీగా నష్టపోతారు. అయితే 2.ఓ సినిమాని లీకేజీ వీరుల బారీన ప‌డ‌కుండా కాపాడాల‌ని చిత్ర‌బృందం శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తోంది. ఈ సినిమా పైరసీ భూతం బారిన పడకుండా కాపాడాలని 2.ఓ టీం ర‌జ‌నీ అభిమానుల స‌హాయాన్ని కోరుతోంది. మరి తమిళ స్టార్ హీరో విశాల్ ఎప్పటినుండో ఈ పైరసీ మీద ఫైట్ చేస్తున్నాడు. కానీ ఆ విషయంలో విశాల్ సాధించింది ఏమి కనబడడం లేదు. విశాల్ ఎలాంటి స్టెప్ తీసుకున్నప్పటికీ.... పైరసీ వీరులు మరింతగా రెచ్చిపోతున్నారు. చూద్దాం 2.ఓ సినిమా పరిస్థితి ఏం కాబోతుందో అనేది.

Similar News