శిరీష్ కి అన్యాయం చేసిన దర్శకుడు?

Update: 2018-08-28 03:32 GMT

ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒకే ఒక్క సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఆగష్టు 15 న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ విడుదలయిన గీత గోవిందం సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. విజయ్ దేవరకొండ - రష్మిక లు జంటగా నటించిన గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోవడమే కాదు. మెగాస్టార్ చిరు అభినందనలతో పాటుగా మహేష్ అభినందనలు.. ఇంకా ఇండస్ట్రీలోని పలువురు గీత గోవిందం సినిమాని తెగ పొగిడేశారు. అయితే అంత అద్భుతమైన హిట్ మెగా హీరో చేతిలో నుండి చేజారిపోయిందట. ఆ సినిమా విజయం గుర్తొచ్చినప్పుడలా.. ఆ మెగా హీరో కి చాలా బాధగా వుంటుందట.

ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. అల్లు శిరీష్ అట. పరశురామ్ తో గీత ఆర్ట్స్ వారు అల్లు శిరీష్ హీరోగా శ్రీరస్తు శుభమస్తు సినిమా తీసే టైం లోనే గీత గోవిందం కథను దర్శకుడు పరశురామ్ డెవెలెప్ చేసాడట. ఇక రెండో సినిమాకి గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి అడ్వాన్స్ పుచ్చుకున్న పరశురామ్ బన్నీ వాస్ కి, అల్లు అరవింద్ కి గీత గోవిందం సినిమా కథ వినిపించాడట. అయితే కథ బాగా నచ్చిన అరవింద్ ఈ కథతో తన చిన్న కొడుకు శిరీష్ తో సినిమా చెయ్యమని పరశురామ్ తో చెప్పాడట. ఇక శిరీష్ కూడా ఈ సినిమా నేను చేస్తా అంటూ ముందుకు వచ్చాడట. కానీ పరశురామ్ మాత్రం ఈ కథ శిరీష్ తో వర్కౌట్ అవ్వదని కామెడీ యాంగిల్ ఉన్న హీరోతో ఈ సినిమా చెయ్యాలని.. అప్పుడే సినిమా హిట్ అవుతుందని పట్టుబట్టుకుని కూర్చున్నాడట.

ఇక శిరీష్ కూడా పరశురామ్ తో ఎన్నిసార్లు మీట్ అయ్యి సినిమా చేద్దామన్నా పరశురామ్ మాత్రం కాదు కూడదనడంతో.. ఆ కథ విజయ్ దేవరకొండ దగ్గరకి వెళ్లిందట. మొదట్లో విజయ్ దేవరకొండ ఈ కథ కి ఓకె చెప్పకపోయినా... తర్వాత ఓకె అనడం సినిమా గీత ఆర్ట్స్ లో తెరకెక్కడం.. సినిమా సూపర్ హిట్ అవడం జరిగాయి. మరి ఇంతలాంటి హిట్ సినిమా చేజారినందుకు శిరీష్ కాస్త బాధ పడ్డాడట. కానీ తమ బ్యానర్ లో హిట్ వచ్చిందండుకు హ్యాపీగానే ఉన్నాడట. అయితే ఈ సినిమా శిరీష్ తో గనక చేస్తే ఈ రేంజ్ హిట్ వచ్చేది కాదని.. అలాగే ఈమేర కలెక్షన్స్ కూడా వచ్చేవి కాదని అంటున్నారు. ఏది ఏమైనా ఒక మంచి హిట్ ని పరశురామ్ వలన శిరీష్ చేజార్చుకోవడం మాత్రం మెగా ఫ్యామిలీకి కాస్త బాధాకర విషయమే మరి.

Similar News