Maha Shivaratri : పురాణ గాథ.. శివుడు ఎందుకు జ్యోతిర్లింగంగా ఉద్భవించాడు ?

ఇద్దరి మధ్య వాదన తారాస్థాయికి చేరింది. ఇదంతా చూస్తున్న శివుడు.. తన శక్తితో వారిద్దరి అహాన్ని తగ్గించాలని..

Update: 2023-02-13 09:55 GMT

మహాశివరాత్రి.. ఈ ఏడాది (2023) ఫిబ్రవరి 18న ఈ పర్వదినం రాబోతోంది. ఈ రోజున ప్రజలు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తారు. అభిషేకప్రియుడైన స్వామివారికి.. పంచామృతాలతో, బిల్వ పత్రాలు, మారేడు దళాలతో అభిషేకం చేస్తారు. ప్రముఖ ఆలయాల్లో లక్షబిల్వార్చన నిర్వహిస్తారు. రోజంతా అభిషేకాలతో ఆ లయకారుడు పులకించిపోతాడు. శివపంచాక్షరి స్మరణతో, ఉపవాస, జాగరణలతో.. శివానుగ్రహాన్ని పొందేందుకు భక్తులు ప్రయత్నిస్తుంటారు. శివుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించిన రోజే మహా శివరాత్రి. అయితే.. అలా లింగరూపంలోకి మారడం వెనుక ఓ పురాణ గాథ ఉంది.

ఒకరోజు సృష్టి, స్థితి కారులైన.. బ్రహ్మ, విష్ణుమూర్తి ల మధ్య మాటా మాటా పెరిగి.. ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకోవాలని భావించారు. ఈ విషయమై. ఇద్దరి మధ్య వాదన తారాస్థాయికి చేరింది. ఇదంతా చూస్తున్న శివుడు.. తన శక్తితో వారిద్దరి అహాన్ని తగ్గించాలని భావించాడు. మాఘమాస చతుర్ధశి తిధి రోజు ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆశివుని యొక్క ఆది, అంతం తెలుసుకోవాలని అప్పుడు వాళ్లే గొప్ప అని ఛాలెంజ్ చేసుకుంటారు. విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుకుతూ వెళ్ళాడు. మరోవైపు బ్రహ్మ తన హంస వాహనమెక్కి ఆకాశమంతా తిరగడం ప్రారంభించాడు. ఎంత వెతికినా.. లింగం మొదలు, చివర ఎక్కడో తెలుసుకోలేక అలసిపోతారు.

చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరు కలసి లింగం వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాం. అని చెప్పగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో, వాదోప వాదనతో ఉన్నదానిని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారంగా అవతరించాల్సి వచ్చింది అని వారికి నిజరూపంతో వివరించి చెబుతాడు. బ్రహ్మ, విష్ణువులు శివుడి ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి అయిందని పురాణ కథనం. అప్పటి నుండి ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్థశినాడు మహాశివరాత్రిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.





Tags:    

Similar News