Maha Shivaratri : శివరాత్రి రోజున ఈ పొరపాట్లు అస్సలు చేయకండి
సాయంత్రం దైవ దర్శనానంతరం పండ్లు, పాల స్వీకరణతో ఉపవాసాన్ని విరమిస్తారు. రేయంతా జాగరణ చేసి..
maha shivaratri
తెలుగు నెలల ప్రకారం ప్రతి ఏటా మాఘ మాసంలో వచ్చే అమావాస్య ముందురోజు అనగా.. బహుళ చతుర్థశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటాం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని.. శైవభక్తులు కటిక ఉపవాసం ఉండి.. సాయంత్రం దైవ దర్శనానంతరం పండ్లు, పాల స్వీకరణతో ఉపవాసాన్ని విరమిస్తారు. రేయంతా జాగరణ చేసి.. ఉదయాన్నే మళ్లీ శివపూజ చేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18న మహాశివరాత్రి రానుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. అయితే.. చాలా మంది శివరాత్రి రోజున కొన్ని చేయకూడని పొరపాట్లు చేస్తుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహాశివరాత్రి వేళ శివలింగానికి తులసి ఆకులను సమర్పించరాదు. అలాగే ప్యాకెట్ పాలతో శివునికి అభిషేకం చేయకూడదు. కేవలం ఆవుపాలను మాత్రమే అభిషేకానికి ఉపయోగించాలి. శివలింగానికి అభిషేకం చేస్తుండగా.. ఇతర విషయాల గురించి మాట్లాడకూడదు. స్త్రీలు అభిషేకం చేసేటపుడు లింగాన్ని తాకకూడదు. మన శరీరం నుండి వెలువడే చెమట, వెంట్రుకలు లింగంపై పడకూడదు. ఆ రోజున మద్యం, మాంసం తినకూడదు. మహాశివరాత్రి రోజున చిన్న చీమకైనా హాని తలపెట్టకూడదు. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, అసభ్య పదజాలంతో దూషించడం వంటివి చేయకూడదు.