Sat Mar 07 2026 11:47:27 GMT+0530 (India Standard Time)
T20 World Cup 2024: పసికూన అని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు బాసూ
టీ 20 ప్రపంచకప్ లో నేడు భారత్ మరో సమరానికి సిద్ధమవుతుంది. ఈరోజు భారత్ - అమెరికా మ్యాచ్ జరగనుంది.

టీ 20 ప్రపంచకప్ లో నేడు భారత్ మరో సమరానికి సిద్ధమవుతుంది. ఈరోజు భారత్ - అమెరికా మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్, అమెరికాలు ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి ఎ గ్రూపులో అగ్రస్థానంలో నిలిచాయి. అమెరికా గతంలో ఎన్నడూ లేనివిధంగా, ఎవరూ ఊహించని విధంగా, అంచనాలకు భిన్నంగా దూసుకు వస్తుండటంతో ఈసారి అమెరికాతో భారత్ ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే అమెరికా అగ్రరాజ్యమైనా.. నిన్నటి వరకూ క్రికెట్ లో చిన్నదేశంగా కనిపించినా.. నేడు అలా లేదు.
రెండింటిలో గెలిచి...
పాకిస్థాన్ ను సూపర్ ఓవర లో గెలిచి అది ప్రపంచంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక కెనడాతో పోరులోనూ గెలిచి పాయింట్ల పట్టికలో భారత్ కు ధీటుగా ఉంది. అమెరికా జట్టులో భారతీయ సంతతికి చెందిన వారు ఎక్కువగా ఉండటం కూడా ఆ జట్టుకు కలసి వచ్చే అంశంగానే చెప్పాలి. ఎందుకంటే అమెరికాలో సహజంగా క్రికెట్ అంటే ఆసక్తి తక్కువ. అందుకే అక్కడి నుంచి కన్నా ప్రవాస భారతీయులే ఎక్కువగా కనిపిస్తున్నారు. వారే వరల్డ్ కప్ లో అదరగొడుతున్నారు.
కొద్ది మార్పులతో...
అమెరికాను పసికూనగా పరిగణించడానికి వీలులేని పరిస్థితి. అందుకే ఈ మ్యాచ్ భారత్ కు కీలకమనే చెప్పాలి. ఏమాత్రం అలక్ష్యం, నిర్లక్ష్యం చూపించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే భారత్ లో స్వల్ప మార్పులతో ఈ మ్యాచ్ లోకి దిగనుంది. శివమ్ దూబే ఆశించినంతగా రాణించకపోవడంతో పాటు సులువైన క్యాచ్ కూడా మిస్ చేయడం అతనినిని పక్కకు పెట్టడానికి కారణమయింది. అతడి స్థానంలో సంజూ శాంసన్ కు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం మీద బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగా కనిపిస్తున్న భారత్ అమెరికాను ఎంత మేరకు నిలువరిస్తుందన్నది చూడాల్సి ఉంది.
Next Story

