Sun Feb 01 2026 17:07:17 GMT+0000 (Coordinated Universal Time)
వరంగల్: మందు పార్టీ చేసుకుంటుండగా.. ఒక్కసారిగా పడ్డ పిడుగు
యువకులు గ్రామ శివారులో దసరా సంబరాల్లో భాగంగా మద్యం పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.

పిడుగులు ఎంతో మంది ప్రాణాలు తీస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్న సమయాల్లో బహిరంగప్రదేశాల్లోనూ, ఆరుబయట ఉండకూడదని చెబుతూ ఉంటారు. అలాంటి సమయాలు ఎంతో ప్రమాదకరం. తాజాగా వరంగల్ జిల్లాలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. మందు పార్టీపై పిడుగు పడింది. ఈ ఘటనలో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతపురం గ్రామానికి చెందిన యువకులు గ్రామ శివారులో దసరా సంబరాల్లో భాగంగా మద్యం పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. మిత్రులంతా కలిసి మద్యం తాగుతుండగా ఉన్నట్టుండి వారిపై పిడుగు పడింది. దీంతో మందు పార్టీకి హాజరైన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పండగ పూట ముగ్గురు యువకులు పిడుగుపాటుకు గురై చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Next Story

