Fri Apr 10 2026 22:04:05 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : విశాఖలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్
మంత్రి నారా లోకేశ్ ఈరోజు ఉదయం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.

మంత్రి నారా లోకేశ్ ఈరోజు ఉదయం విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి వేతన స్కేళ్లను వర్తింపజేయాలని అనకాపల్లి జిల్లాకు చెందిన నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేశ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఫార్మసీలో మాస్టర్స్ చేసిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని విశాఖకు చెందిన యామిని కోరారు.
వివిధ సమస్యలను...
అనకాపల్లి జిల్లా సీతపాలెం గ్రామ భూ నిర్వాసితుల పునరావాసం, నష్టపరిహారం, సైట్ కేటాయింపుతో పాటు స్థానికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు మంత్రి నారా లోకేశ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి లక్ష్మీదేవిపేటలోని శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని శ్రీ కనకదుర్గమ్మ ప్రార్థన సొసైటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేశ్ ను కలిసి కోరారు. ఇటీవల ప్రతిపాదిత ప్లైఓవర్ నిర్మాణం కారణంగా పవిత్ర ఆలయానికి భంగం కలగకుండా చూడాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరవాడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పీల దిలీప్ కుమార్ తమ ఇంటిని అక్రమంగా స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని అనకాపల్లికి చెందిన పి.సతీష్ కుమార్ మంత్రి నారా లోకేశ్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
Next Story

