సీఎం పదవి మీద ఆశ లేదంటున్న చినబాబు
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా అలాంటి చరిత్ర నమోదు కాలేదు గానీ.. ముఖ్యమంత్రుల పుత్రులు తాము కూడా ముఖ్యమంత్రులు కావాలని కోరుకోవడం సహజమే అని లోకరీతి ఎరిగిన జనం అనుకుంటూ ఉంటారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ మాత్రం , సీఎం పదవి మీద తనకు ఏమాత్రం ఆశ లేదని అంటున్నారు. ఇంతకూ నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవి మీద తనకు ఆశ ఉన్నదో లేదో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చినట్టు? ఒకవైపు ఇవాళో రేపో చంద్రబాబునాయుడు కేబినెట్ విస్తరణ చేపడితే ఖచ్చితంగా మంత్రి పదవిని అధిరోహిస్తాడని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. ఆయన ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆసక్తి కరమే.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ తరఫున జనచైతన్య యాత్రలో భాగంగా అనంతపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా లోకేష్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రత్యేక ప్యాకేజీ లో ఉన్న వెసులుబాటుల వల్లనే ఏపీకి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు రాబోతున్నాయని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరగబోతున్నాయని లోకేష్ చెప్పారు. హోదాతో సమానంగా పరిశ్రమలు వస్తాయనే నమ్మకం కలిగినందునే ప్యాకేజీ తీసుకున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన లోకేష్, అందులో భాగంగా వారు అడిగిన అనేక ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఒకరు అడిగిన ప్రశ్నకు జవాబుగా.. తనకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదని లోకేష్ చెప్పడం ఆసక్తికరం. రానున్న 20 ఏళ్లపాటూ చంద్రబాబునాయుడే సీఎంగా ఉంటారంటూ లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్ద నోట్లు రద్దుచేసి 100తో పాటు, 200 రూపాయల నోట్లను పెద్ద సంఖ్యలో ప్రభుత్వం తీసుకురావాలని కూడా లోకేష్ తన అభిప్రాయం వెల్లడించారు.
అయితే ట్విస్టు ఏంటంటే.. లోకేష్ ఈ కార్యక్రమాన్ని మంత్రి పల్లె రఘునాధరెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలోనే నిర్వహించడం విశేషం. ఇక మంత్రిగారి కాలేజీలో, కాబోయే మంత్రిగారు ఓ ముఖాముఖి నిర్వహిస్తే.. ఆయనను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఎవరు మాత్రం అడుగుతారు..? కార్యక్రమం మొత్తం సాఫీగా జరిగిపోవడం విశేషం.