వారు నీళ్లిస్తామంటే.. చంద్రబాబు మజ్జిగ ఇస్తున్నారు!
నోట్ల రద్దు నేపథ్యంలో లావాదేవీల్లో ప్రజలు చిన్న చిన్న కష్టాలు పడుతూనే ఉన్నారు. ఈ కష్టాల విషయంలో తక్షణం ఎవ్వరూ చేయగలిగింది కూడా ఏమీ లేదు. కాకపోతే ఈ కష్టాలను తగ్గించడానికి ప్రభుత్వాలు చేయగలిగినవి చేస్తున్నాయి. కాకపోతే కష్టాలు పడుతున్న ప్రజల వద్ద ఇమేజి తెచ్చుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నించడంలో ఆశ్చర్యం ఏముంది. అందుకే.. స్వయంగా క్యూలైన్ లోకి వెళితే తప్ప.. ప్రజల కష్టాలు తెలియవు అని డిసైడ్ అయినట్లుగా ఆ పనిచేసిన రాహుల్ గాంధీ తన పార్టీ వారికి ఓ పిలుపు ఇచ్చారు. క్యూలైన్ లలో కష్టాలు పడుతున్న ప్రజలకు , సామాన్యులకు తాగునీరు సరఫరా చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. రాహుల్ పిలుపు మేరకు క్యూలైన్ల వద్ద సేవలు చేస్తాం అని ఏపీసీసీ రెండు రోజుల తర్వాత స్పందిస్తోంది కూడా!
ఆ సంగతి పక్కన పెడితే.. రాహుల్ గాంధీ క్యూల్లోని సామాన్యులకు తాగునీరు ఇవ్వాలని పిలుపు ఇస్తే.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దీనికి కౌంటర్ అనదగిన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఏకంగా క్యూలైన్ల లో ఉన్న వారందరికీ మజ్జిగ సరఫరాచేసే ప్రయత్నం చేయాలంటూ పిలుపు ఇచ్చారు. ఈ నిర్ణయాలు రాజకీయ పార్టీల ఇమేజిని అమాంతం పెంచేయకపోవచ్చు, అలాగే ప్రజల కష్టాలను సాంతం తుడిచిపెట్టేయకపోవచ్చు.. కానీ వారికి ఎంతో కొంత ఉపశమనంగా ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.