రేవంత్ రెడ్డి.. మరో నిరుపయోగ ప్రయత్నం
తెలంగాణలో కేసీఆర్ సర్కారు మీద పోరాటం సాగించడంలో అలుపెరగకుండా కష్టపడుతున్న వారిలో ఒకరైన తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్ కోసం తాజాగా మరో ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో విపక్షాల్లోని ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో అధికార పార్టీ లో చేరిపోయిన నేపథ్యంలో వారి మీద అనర్హత వేటు వేయడానికి ఆయన అసెంబ్లీ స్పీకరుకు గడువును గుర్తు చేస్తున్నారు. సుప్రీం కోర్టు గట్టిగా నిలదీసి అడిగితేనే అనర్హత వేటు విషయంలో వీసమెత్తు అయినా స్పందించకుండా ఉండిపోయిన స్పీకరు, రేవంత్ రెడ్డి లేఖకు ఏ మాత్రం విలువ ఇస్తారో తెలియదు గానీ.. రేవంత్ ప్రయత్నం వలన.. ఎమ్మెల్యేల ఫిరాయింపు అనే వివాదం మరోసారి ప్రజల దృష్టికి మాత్రం వస్తుంది.
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే తెలుగుదేశం కూడా సుదీర్ఘకాలంగా పోరాటం సాగించింది. తొలుత కొందరు ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకోగానే, అప్పటి తెదేపా ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి న్యాయపోరాటం ప్రారంభించారు. తీరా ఆయన కూడా ఫిరాయించేసిన తర్వాత ఆ బాధ్యతను రేవంత్ రెడ్డి భుజానికెత్తుకున్నారు. అయితే ఇటీవల.. హైకోర్టు ఈ కేసులో తీర్పు ఇస్తూ మూడు నెలల్ల్లోగా అనర్హత లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకరుకు సూచించింది. అయితే అది కేవలం స్పీకరుకు చేసిన సూచన మాత్రమేనని, ఆచరించడం ఆయన ఇష్టం అని గులాబీ శ్రేణులు అంటున్నాయి. అదే సమయంలో, అది సూచన కాదు ఆదేశం అని.. ఆచరించి తీరాల్సిందేనని.. ఆచరించకపోతే కోర్టు ధిక్కారం కేసు వేస్తాం అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో హైకోర్టు చెప్పిన గడువు డిసెంబరు 20 లోగా తీసుకోవాలని గుర్తుచేస్తూ రేవంత్ స్పీకరుకు లేఖ రాశారు.
అసలు ఈ విషయంలో సుప్రీం కోర్టు ‘మీకు నిర్ణయానికి ఎంత సమయం కావాలి’ అని అడిగితేనే స్పీకరు కనీసం సమాధానం ఇవ్వలేదు. మరి హైకోర్టు సూచనకు, దాన్ని గుర్తు చేసే రేవంత్ లేఖకు స్పందిస్తారా అనేది జనంలో జరుగుతున్న చర్చ. ఫలితం లేకపోయినా , ఉండదని తెలిసినా రేవంత్ మాత్రం పట్టు వదలకుండా ప్రయత్నం చేస్తున్నారని పలువురు అంటున్నారు.