రెగ్యులరైజేషన్ చేసిన వారిపై ఐటీ కన్ను!
రెగ్యులరైజేషన్ చేసుకోడానికి లక్షల మొత్తాల్లో పాతనోట్లు ఇచ్చి, కొందరు ఆ సొమ్మును వైట్ గా మార్చుకున్నారు సరే. వారు హఠాత్తుగా చెల్లించిన ఆ సొమ్ముకు లెక్కేమిటి? అలాగే.. ఇక్కడ ఇన్ని లక్షలు చెల్లించి.. మళ్లీ తమ బ్యాంకు ఖాతాల్లో అనుమతించిన రెండున్నర లక్షలు కూడా వేసుకుని ఉభయ మార్గాల్లో లబ్ధి పొందడానికి వారు ప్రయత్నిస్తున్నారా అనే సంగతి గమనించడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు దృష్టి సారిస్తున్నట్లుగా తెలుస్తోంది.
నోట్ల రద్దు వ్యవహారం తరువాత రెండు రోజులు మౌనంగా ఉన్న ఐటీ అధికారులు.. నెమ్మదిగా జూలు విదిలిస్తున్నారు. బంగారం కొనుగోళ్లు చేసిన వారి జాబితాలు మొత్తం సేకరిస్తున్న అధికారులు.. ఎవరెవరి మీద ఐటీదాడులు చేయవచ్చో లెక్క తీస్తున్నారు. హఠాత్తుగా ఇబ్బడి ముబ్బడిగా డబ్బు లావాదేవీలు వెలుగుచూసిన వారి మీద ఐటీ శాఖ కన్ను వేస్తోంది.
అదే క్రమంలో హైదరాబాదు నగరంలో జీహెచ్ఎంసీ కి భూముల రెగ్యులరైజేషన్ విషయంలో పెనాల్టీ రుసుములు చెల్లించిన వారిమీద కూడా ఐటీ శాఖ నజర్ వేసినట్లుగా తెలుస్తున్నది. రెండు రోజుల్లోనే ప్రభుత్వానికి 50 కోట్ల రూపాయలకు పైగా రాబడి వచ్చింది. ఈ చెల్లింపులు చేసిన వారిలో పెద్దపెద్ద స్థలాలు, భవంతులకు సంబంధించి పెనాల్టీలు కట్టిన బడాబాబులు కూడా అనేక మంది ఉన్నారు. చెల్లింపుల వివరాలు సేకరిస్తున్న ఐటీ శాఖ.. తాము ఎవరి మీద దాడులు చేయవచ్చుననే విషయంలో ఇంకా పూర్తిస్థాయి కసరత్తు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి ఎలాంటి వ్యవహారం ఎలా మలుపులు తిరిగి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఏమీ అర్థం కాని రీతిలో నల్ల కుబేరులు బెంబేలెత్తిపోతున్నారంటే అతిశయోక్తి కాదు.