యూపీలో భారీ రైలు ప్రమాదం : 20 మంది మృతి
ఉత్తరప్రదేశ్ లో భారీ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పాట్నా – ఇండోర్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మొత్తం 14 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఆదివారం ఉదయం 7 గంటల వరకు 20 మంది మరణించినట్లుగా గుర్తించారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని అనుకుంటున్నారు. యూపీలోని ఖాన్పూర్ జిల్లా పుఖ్రయాన్ వద్ద రైలు ప్రమాదానికి గురైంది.
అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పోలీసు వైద్య సహాయక బృందాలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగాయి. ఏకంగా 14 బోగీలు పట్టాలు తప్పి ఘోర ప్రమాదానికి గురికావడంతో ప్రమాద స్థలం మొత్తం భీతావహంగా మారిపోయింది.
ప్రమాదంలో ఎటు చూసినా క్షతగాత్రుల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. స్థానికులు కూడా ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అధికారులు అంటున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు హుటాహుటిన తరలిస్తున్నారు.