యూఎస్ హౌస్ లో అడుగుపెట్టనున్న తమిళ తంబి
అమెరికాలో ఓ కొత్త అధ్యాయానికి బుధవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో శ్రీకారం జరిగింది. భారత సంతతికి చెందిన వ్యక్తి తొలిసారిగా.. అమెరికాలోని హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ లోకి ప్రతినిధిగా అడుగుపెట్టబోతున్నారు. అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో వివిధ రాజకీయ పదవులను అధిష్టించడం కొత్త కాకపోయినప్పటికీ.. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ స్థాయి పదవికి ఒకరు వెళ్లడం అనేది ఇదే ప్రథమం. తమిళనాడు కు చెందిన రాజా కృష్ణమూర్తి ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇల్లినాయిస్ రాష్ట్రం నుంచి యూఎస్ హౌస్కు ఆయన డెమొక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. అమెరికా కాంగ్రెస్ కు వెళ్లబోతున్న తొలి తమిళ వ్యక్తి కూడా రాజా కృష్ణమూర్తి కావడం విశేషం.
రాజా క్రిష్ణమూర్తి మూడునెలల వయసులోనే అమెరికాకు వెళ్లారు. అక్కడి ప్రిన్స్టన్ యూనివర్సిటీలోనే మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. డాక్టరేట్ కూడా చేశారు. శివనాధన్ ల్యాబ్స్ అండ్ ఎపిసోలార్ కంపెనీకి ఆయన అధ్యక్షుడు. ఇన్స్పైర్ అనే ఎన్జీవో ద్వారా సోలార్ టెక్నాలజీలో విద్యార్థులకు ఉచిత శిక్షణలు ఇస్తున్నారు. మొత్తానికి రాజా కృష్ణమూర్తి అరుదైన ఘనతను సాధించారు.
అలాగే భారత సంతతికి చెందిన ప్రమీల జయపాల్ వాషింగ్టన్ నుంచి అమెరికన్ కాంగ్రెస్ కు సెనేటర్ గా ఎన్నికయ్యారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున ఆమె పోటీచేశారు. యూఎస్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ కు ఆమె ఎన్నికయ్యారు. జయపాల్ కూడా తమిళనాడుకు చెందిన మహిళే. చెన్నయ్ లో పుట్టిన ఆమె ఇండోనేషియా, సింగపూర్ ల తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. వలసదారుల కోసం చాలా కృషి చేసి గుర్తింపుతెచ్చుకున్నారు.