యాదాద్రిలో కెసిఆర్ కుటుంబం!
నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం ఉదయం దర్శించుకున్నారు. సతీ సమేతరంగా హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో విచ్చేసిన కేసీఆర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. యాదాద్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి నరసింహుని కల్యాణం జరుగనుంది.
కల్యాణం సందర్భంగా స్వామికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కాగా ఆలయ సందర్శన అనంతరం కేసీఆర్ యాదాద్రిలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులను ఆరా తీశారు. సీఎంకు జిల్లా మంత్రి జగదీశ్వరరెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తదితరులు స్వాగతం పలికారు. ఇదిలాఉండగా ఈరోజు సాయంత్రం జరిగే లక్ష్మీ నరసింహస్వామి కల్యాణానికి గవర్నర్ నరసింహన్ సతీ సమేతంగా హాజరుకానున్నారు. సాయంత్రం యాదాద్రికి చేరుకోనున్న నరసింహన్ స్వామివారి కల్యాణం తిలకించాక హైదరాబాద్ తిరిగి వెళతారు.