మెట్రో సందేహాలకు చెల్లుచీటీ : ఉగాదికి నడుస్తుందిట!
హైదరాబాదు నగరంలో మెట్రో రైలు విషయంలో జనంలో చాలా సందేహాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన కొన్ని అనుమతుల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడడం, ఎల్ అండ్ టీ సంస్థ నిర్మాణ బాధ్యతలనుంచి తప్పుకోవడం, పాతబస్తీ మొదులుగా పలు ప్రాంతాల్లో నిర్మాణం చేపట్టడానికి అనేక ఆటంకాలను క్లియర్ చేయడంలో ప్రభుత్వం విఫలం కావడం.. ఏతావతా.. అసలు మెట్రో రైలు ఎప్పటికి నడుస్తుందా? అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. ఇలాంటి భయసందేహాలకు ఫుల్ స్టాప్ పెడుతూ.. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చాలా విషయాలకు సంబంధించి మంగళవారం నాడు క్లారిటీ ఇచ్చారు. 2017 ఉగాది నాటికి మెట్రో రైలు నడుస్తుందని ఆయన ప్రకటించారు.
మెట్రో రైలు పనులు ఇప్పటికే పూర్తయిన నాగోలు-మెట్టుగూడ, మియాపూర్ – ఎస్సార్ నగర్ మార్గాల్లో తొలిసారిగా మెట్రో రైలు నడుస్తుంది. అనుకున్న షెడ్యూలు ప్రకారమే మెట్రోరైలు నడవడం ప్రారంభం అవుతుందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. తొలి దశలో 20 కిమీల మేర మెట్రో రైలు నడుస్తుంది. పాతబస్తీలో మినహా మరెక్కడా కూడా నిర్మాణానికి సంబంధించిన ఇబ్బందులు లేవని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో రైలు నిర్మాణ పనులను వదిలేసిందనే పుకార్లలో ఏమాత్రం నిజం లేదని కూడా ఆయన స్పష్టత ఇచ్చారు.
అరిష్టాలు తొలగినట్లే..
చూడబోతే మెట్రో రైలు విషయంలో ప్రభుత్వ పరంగా ఉన్న ఆటంకాలు చాలా వరకు తొలగినట్లే కనిపిస్తోంది. నిజానికి మెట్రో రైలు తొలిదశ పనులు పూర్తయి ఈ ఏడాది ఉగాది నాటికే రైలు పరుగులు పెట్టి ఉండాల్సింది. మిగిలిన మెట్రో పనులు కూడా ఇంకాస్త వేగంగా జరిగి ఉండాల్సింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వంతో.. మెట్రో పనులు చేపట్టిన ఎల్ అండ్ టీ కి ప్రతిష్టంభన ఏర్పడింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిర్మాణ సంస్థకు అనేక కొత్త నిబంధనలు విధించడానికి ప్రయత్నించింది. అసెంబ్లీ వద్ద , ఇప్పుడు పనులు జరుగుతున్న తీరులో కాకుండా, అసెంబ్లీ వెనుక వైపు నుంచి.. భూగర్భంలో మెట్రో రైలు నడపాలంటూ.. కేసీఆర్ సర్కారు కొత్త మార్పు చేర్పులతో మెట్రో పనులకు దాదాపుగా బ్రేకులు వేసింది.
ప్రభుత్వం కొత్తగా అడుగుతున్నట్లుగా డిజైన్ లో మార్పు చేర్పులు చేయాలంటే గనుక.. కొన్ని వేల కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుందంటూ ఎల్ అండ్ టీ కోట్ చేసింది. దీంతో కేసీఆర్ సర్కారు వెనక్కు తగ్గింది. చివరికి పిల్లర్ల మీద ప్రకటనల సొమ్ములో జీహెచ్ఎంసీకి వాటా ఇవ్వాల్సిందే నంటూ చిన్న చిన్న చికాకుల వద్ద కూడా ఎల్ అండ్ టీకి ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నించారు. ఈ తరహా చర్చల్లోనే గడిపేస్తూ పనులు దాదాపుగా స్తంభించాయి. ఏతావతా అనివార్యమైన జాప్యం జరిగింది. ఆ తర్వాత ఎల్ అండ్ టీ సంస్థకు కొత్తగా తాము విధిస్తున్న నిబంధనలేమీ ధర్మసమ్మతమైనవి కాదనే అభిప్రాయానికి కేసీఆర్ సర్కారు వచ్చినట్లుంది. వారు వెనక్కు తగ్గడంతో తిరిగి పనులు జరిగాయి. మొత్తానికి వచ్చే ఏడాది ఉగాది నాటికి మెట్రో రైలు పరుగులు తీసే సంకేతాలు కనిపిస్తున్నాయి.