మంత్రి నారాయణ హవా ఆ రేంజిలో సాగుతోంది మరి!
చంద్రబాబు కేబినెట్ లో అత్యంత బలవంతుడైన మంత్రి ఎవరు? అంటే ఎవ్వరైనా సరే.. ముందుగా పురపాలక శాఖ మంత్రి నారాయణ పేరునే చెబుతారు. ఆర్థిక, హోం శాఖ వంటి కీలక శాఖలు కాకపోయినా.. అమరావతి నిర్మాణం మొత్తం తన గుప్పిటలో కలిగిఉన్న పురపాలక శాఖ మంత్రి నారాయణ హవా నడిచినట్లుగా మరెవ్వరికీ అంత ధాటిగా నడుస్తున్నట్లు లేదు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కూడా.. మూడు జిల్లాల్లో తెలుగుదేశం అభ్యర్థిత్వానికి పోటీ ఎంత గట్టిగా ఉన్నప్పటికీ మంత్రి నారాయణ అనుచరుడు మరియు ఆయన సంస్థల్లో ఉద్యోగి అయిన కార్యకర్తకే కట్టబెట్టడం అనేది నారాయణ హవాకు నిదర్శనంగా నాయకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థుల పేర్లను ఏపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు బుధవారం ప్రకటించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పేరును ఖరారు చేశారు. కడప, కర్నూలు, అనంతపురం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె.జె.రెడ్డి, ఉపాధ్యాయ స్థానానికి బచ్చల పుల్లయ్య పేరును ఖరారు చేశారు.
వీరిలో నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి.. మంత్రి నారాయణకు ముఖ్య అనుచరుడు. నమ్మిన బంటు అని చెప్పాలి. ఆయన ప్రస్తుతం నారాయణ హాస్పిటల్స్ సీఈవోగా ఉన్నారు. నెల్లూరు జిల్లానుంచే ఇంకా అనేకమంది తెలుగుదేశం నాయకులు అభ్యర్థిత్వానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి నారాలోకేష్ సేవాసమితికి ఫౌండర్ కూడా! తెదేపాలో తన సొంత మనుషులకు సునాయాసంగా ఎంతో పోటీ ఉండే ఎమ్మెల్సీ టిక్కెట్ లను ఇప్పించుకోగలిగే స్థాయిలో మంత్రి నారాయణ హవా నడుస్తున్నదని అంతా అనుకుంటున్నారు.