పోలవరంపై చంద్రబాబు కలరింగ్ అదుర్స్...!

పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి, రాష్ట్ర రైతుల భాగ్యరేఖ- తరచుగా సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చే మాట ఇది. ఏపీ విభజన చట్టం ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యతను కేంద్రం తీసుకుంది. కేంద్రమే పూర్తిగా ఖర్చులు భరించి దీనిని ఏపీకి అందిస్తుంది కూడా. ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. అయితే, సీఎం చంద్రబాబు కలరింగ్ మాత్రం ఎక్కువైందనే వ్యాఖ్యలు వినిపించాయి. దీనిని ఎన్నికల ప్రాజెక్టుగా ఆయన భావించారు. వచ్చే 2019లో ఎన్నికలు జరగనున్నందున ఈ ప్రాజెక్టులో కొంత భాగాన్నైనా త్వరగా పూర్తి చేసి.. నీళ్లు పారించడం, గేట్లు పెట్టడం ద్వారా ప్రాజెక్టు క్రెడిట్ను తనఖాతాలో వేసేసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రాజెక్టు అయినా కూడా రాష్ట్రమే చొరవ తీసుకుంటోందని ప్రకటించి పనుల్లో వేలు పెట్టారు.
ఇప్పుడు మరో సమస్య....
ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ ట్రాయ్ విషయంలో బాబు ఇలానే వ్యవహరించాడు. అయితే, కేంద్ర ప్రాజెక్టు అయిన పోలవరంపై బాబు పెత్తనం ఏంటనేది కేంద్ర అధికారుల వాదన. అంతేకాదు, కాంట్రాక్టుల పేరుతో ఏదో జరుగుతోందని గతంలో కేంద్ర జలవనరుల శాఖకు కార్యదర్శిగా పనిచేసిన అమర్జిత్ సింగ్ వ్యాఖ్యానించాడు కూడా. దీంతో కేంద్రం ఈ ప్రాజెక్టుపై పూర్తి అధ్యయనానికి తెరదీసింది. దీంతో బాబు ఆగ్రహోదగ్రుడయ్యారు. పోలవరం పూర్తి చేయడం కేంద్రానికి ఇష్టం లేదని, అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని అభాండాలు వేశారు . అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించారు. ఇక, ఇప్పుడు.. ప్రాజెక్టును ఆది నుంచి విమర్శిస్తున్న రెండు రాష్ట్రాల సీఎం వ్యవహారం తెరమీదకి వచ్చింది.
ప్రధాని మోడీదేనన్న....
ఒడిసా, ఛత్తీస్గడ్ లు ఈ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముంపు మండలాల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒడిసా ఎంపీలు లోక్సభలో ఆందోళన కూడా చేశారు. ఇక, ఇప్పుడు ఏకంగా ఒడిసా సీఎం నవీన్.. సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. దీంతో ఈ వివాదం యూ టర్న్ తీసుకుంది. ఈ విషయంపై బాబు మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణంలో ఇదో కొత్త పరిణామం అని వ్యాఖ్యానించారు. సీఎంలు మాట్లాడుకోవాలని ఒడిసా కోరుతోందని అధికారులు తెలపగా..పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రధాని మోడీదే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కేంద్రంపై నెట్టేసేందుకే....
ఇప్పటికే తాను ఒరిస్సా సీఎంతో మాట్లాడానని..రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించినట్లు సమాచారం. చత్తీస్ ఘడ్ సీఎంకు పరిస్థితి వివరించాక..ఆయన ప్రస్తుతం ఏమీ మాట్లాడటం లేదన్నారు. కొద్ది రోజుల క్రితం కేంద్రం కొత్తగా పిలిచిన టెండర్లను పక్కన పెట్టాలని లేఖ రాయగా…దీనిపై నానా యాగీ చేసిన సీఎం చంద్రబాబు ఒడిసా అభ్యంతరాలపై ప్రధానే సమావేశం ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానిస్తున్నారు. సో.. ఇదీ పోలవరం విషయం బాబు రెండు నాల్కల ధోరణి అని అంటున్నారు విశ్లేషకులు.
- Tags
- పోలవరం చంద్రబాబు

